హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, దీన్ని ప్రాథమికదశలో గుర్తిస్తే త్వరగా కోలుకోవచ్చని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రెడ్హిల్స్లో ఉన్న ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో రూ.30 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన రోబోటిక్ ఆపరేషన్ థియేటర్ సహా 8 మాడ్యులర్ థియేటర్లు, దోబీఘాట్, వంటశాలను శుక్రవారం హోంశాఖ మంత్రి మహమూద్అలీతో కలిసి ప్రారంభించారు.
అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… దక్షిణ తెలంగాణలో ఎంఎన్జేలో రోబోటిక్ థియేటర్ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. క్యాన్సర్ రోగుల తాకిడి పెరుగుతుండడంతో పడకల సంఖ్య పెంచుతామని.. రోగులు, వారి సహాయకులకు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు అందించేందుకు మోడ్రన్ కిచెన్ ఏర్పాటు చేశామన్నారు.
ప్రస్తుతం ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో 3 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. అదనంగా ఉన్న 8 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు కావడంతో MNJలో సర్జికల్ ఆంకాలజిస్టులు సంవత్సరానికి 5,000 పెద్ద శస్త్రచికిత్సలు, 7,000 కంటే ఎక్కువ మైనర్ సర్జరీలు చేయడానికి అవకాశం ఉంటుంది. 3 ఆపరేషన్ థియేటర్ల వల్ల ప్రస్తుతం వైద్యులు 1500 మేజర్ సర్జరీలు, 4 వేల మైనర్ సర్జరీలు చేయగలుగుతున్నారని, దీంతో కేన్సర్ పేషెంట్లు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని మంత్రి అన్నారు.
“మేము రూ. 4 కోట్లతో పీజీ వైద్య విద్యార్థుల కోసం సౌకర్యాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉన్నాము. అరబిందో ఫార్మా సహకారంతో 350 పడకల కొత్త MNJ హాస్పిటల్ బ్లాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో మొత్తం ఆసుపత్రి పడకల సంఖ్య 750 కి పెరుగుతాయని మంత్రి తెలిపారు.
తెలంగాణలో ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించడానికి జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసి) ఇప్పటికే అనుమతిని మంజూరు చేసింది, రాబోయే రోజుల్లో మరో మూడు కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చే అవకాశం ఉందని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 1,200 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రానున్నాయి.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానకు రూ.750 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. “ఆరోగ్యశ్రీ కింద 2021-22లో క్యాన్సర్ చికిత్స కోసం 111 కోట్ల రూపాయలు ఖర్చు చేసామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.