హైదరాబాద్: తెలంగాలో బిజెపి తన పునాదిని పటిష్టం చేసుకోవడానికి ఓ వైపు రాజకీయంగా, మరోవైపు మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించడం ద్వారా లౌకిక స్వరూపాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ చిల్లర వేశాలను పసిగట్టి వాటిని బట్టబయలు చేయాలని తన పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.
గత 9 ఏళ్లలో రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగా అభివృద్ధి చేసిందో తెలియజేసేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికీ సమావేశాలు లేదా చిన్న చిన్న గ్రూపుల సమావేశాలు నిర్వహించి పెద్దఎత్తున మౌఖిక ప్రచారాన్ని చేపట్టాలని టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు… ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, దాని మతతత్వ ఎజెండాను బహిర్గతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులను కోరారు. అదేవిధంగా అభివృద్ధి, నిధుల విషయంలో తెలంగాణను కేంద్రం ఏవిధంగా విస్మరించిందనే దానిపైనే సీఎం, పార్టీ నేతల ప్రచారం దృష్టి కేంద్రీకరించనున్నారు.
మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, తెలంగాణ అభివృద్ధిపై దాని ప్రభావంపై ఓ పుస్తకాన్ని కూడా తీసుకురావాలని కేసీఆర్ యోచిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఏ విధంగా పోరాడిందో కూడా డిజిటల్ మీడియా ద్వారా హైలైట్ చేయనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు నేరుగా చర్చలు జరపాలని కేసీఆర్ ప్రతిపాదించారు.