హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా? 25 రాష్ట్రాల రైతులతో రెండు రోజుల పాటు జరిగిన సదస్సు తర్వాత పరిణామాలు గమనిస్తే, ‘అవును’ అనే సమాధానం వస్తుంది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీజేపీ పాలిత కర్ణాటక, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో తన రాజకీయ ఉనికిని చాటుకోవాలని గులాబీ బాస్ కేసీఆర్ చూస్తున్నట్లు సమాచారం. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన జాతీయ రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మూడు రాష్ట్రాల్లో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన విశ్లేషిస్తున్నారు.
కర్నాటక, గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొందరు రైతు నేతలతో సమావేశం నిర్వహించి 25 రాష్ట్రాల రైతు ప్రతినిధులతో చేసినట్లే భవిష్యత్తులో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ మోడల్ ప్రాధాన్యతను వివరించాలని కేసీఆర్ యోచిస్తున్నారని సీనియర్ నేత ఒకరు తెలిపారు. గుజరాత్ రైతుల కంటే తెలంగాణలో రైతులు ఎక్కువ లాభాలు పొందుతున్నారని ఆయన నిరూపించాలనుకుంటున్నారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని గ్రామాలను సందర్శించి ఉత్తర భారత రాష్ట్రాల్లోని రైతుల కష్టాలను ప్రధానంగా గిట్టుబాటు ధరలు వంటి సంబంధిత అంశాలపై అధ్యయనం చేయాలని కూడా యోచిస్తున్నారు.
మొదట బీహార్ వెళ్లాక గతంలో ప్రకటించిన మేరకు, గల్వాన్ లోయలో అమరులైన బీహార్కు చెందిన ఐదుగురు భారత సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తారు. అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో లంచ్లో సమావేశం కానున్నారు. రాజకీయ పరిస్థితులపై ఆర్జేడీ నేతలతోనూ చర్చించనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంపై ఆయన, నితీష్లు చర్చించనున్నారు. మరోసారి అన్ని ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసేందుకు నితీష్తో కలిసి ప్రయత్నం చేస్తారు.
ఆ తరువాత సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా రూ.5 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందిస్తారు. బీహార్ సీఎం నితీశ్కుమార్తో కలిసి అమర జవాన్లు, కార్మికుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తారు.