హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పలు పథకాలు ప్రవేశపెడుతున్నారని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా బేగంబజార్లో రూ.9.50 కోట్లతో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మించిన ఫిష్ మార్కెట్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ భవనాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నిర్మించింది.నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ (NFDB) నిధులతో నిర్మించిన ఈ కొత్త సదుపాయంలో సెల్లార్, గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్లు 3,539 చదరపు మీటర్ల బిల్ట్-అప్ ఏరియాతో ఉన్నాయి.
ఎంతో చరిత్ర కలిగిన బేగంబజార్ ఫిష్ మార్కెట్లో జీ ప్లస్-2 విధానంతో చేపల వ్యాపారులకు అన్ని సౌకర్యాలు కల్పిం చి భవనాన్ని నిర్మించామన్నారు. 43 హోల్సెల్ స్టాల్స్, 1 కోల్డ్ స్టోరేజీ, 90 రిటైల్ స్టాళ్లు, 71 కటింగ్ స్టాల్స్, 10 డ్రై ఫిష్ స్టాల్, ఒక క్యాంటీన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెండు లిఫ్టులను ఏర్పాటు చేసి ఎన్నో ఏళ్లుగా ఈ మార్కెట్పై జీవనోపాధి పొందుతున్న అర్హులైన వ్యాపారులకు మాత్రమే వారి పేర్లతో కూడిన జాబితాను ఏర్పాటు చేసి వారికి స్టాళ్లను కేటాయిస్తామని… బయటి వారికి అనుమతించమన్నారు.
సెల్లార్ ఫ్లోర్ పార్కింగ్ కోసం, గ్రౌండ్ ఫ్లోర్లో హోల్సేల్ సెక్షన్, ఐస్ ఫ్లేక్ మెషిన్, కోల్డ్ స్టోరేజీ రూమ్ ఉంటాయి. మొదటి అంతస్తులో కట్టింగ్ సెక్షన్, రిటైల్ విభాగం, రెండవ అంతస్తులో క్యాంటీన్తో కూడిన డ్రై ఫిష్ సెక్షన్ ఉంటుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిశుభ్రమైన పరిసరాలతో పాటు ప్రైవేట్ రిటైల్ ఔట్లెట్లతో పోల్చితే వినియోగదారులకు సరసమైన ధరకు వివిధ రకాల మత్స్య ఉత్పత్తులను పొందడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ కొత్త సదుపాయంతో చేపలు ఇకపై ఈగలు, ధూళి బారిన పడవని తలసాని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని మల్లాపూర్, కూకట్పల్లిలో మరో రెండు చేపల మార్కెట్ భవనాలను నిర్మిస్తోందని, నగరంలో రూ.50 కోట్ల అంచనా వ్యయంతో హోల్సేల్ ఎగుమతి చేపల మార్కెట్ను నిర్మించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ మార్కెట్ ప్రారంభం కావడంతో దీనిపై దాదాపు 500కుటుంబాలకు జీవనోపాధి కలిగిందని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఫిష్ చైర్మన్ కమిషనర్ లచ్చిరాం భూక్యా, జీహెచ్ఎంసీ ప్రాజెక్టు సీఈ దేవానంద్, డి.డి.నాయక్, ఎస్ఈ దత్తు తదితరులు పాల్గొన్నారు.