హైదరాబాద్: పూర్తిగా శిధిలావస్థలో ఉన్న మార్కెట్లలో ఎదురవుతున్న ఇబ్బందులనుంచి వీధి వ్యాపారులు, వినియోగదారులకు ఊరట కల్పిస్తామని జీహెచ్ఎంసీ ఇచ్చిన వాగ్దానం మేరకు… హైదరాబాద్లో ఐదు ఆధునిక మార్కెట్ల నిర్మాణం వేగమందుకుంది. వీటి నిర్మాణం పూర్తయితే వీధి వ్యాపారులకు వారి వ్యాపారాలను నిర్వహించడానికి తగిన స్థలాన్ని అందించడమే కాకుండా, ఈ ఆధునిక మార్కెట్లు కస్టమర్ల భద్రతను కూడా పెంచుతాయి.
ప్రస్తుతం నారాయణగూడలో రూ. 4 కోట్ల అంచనాతో ఆధునిక మార్కెట్ కోసం నిర్మాణం జరుగుతోంది. 757.89 చదరపు గజాలలో రూపుదిద్దుకుంటున్న ఈ మార్కెట్లో 54 దుకాణాలు ఉంటాయి. కాగా, అమీర్పేటలో రూ.13.2 కోట్లతో ఒకటి, పంజాగుట్టలో రూ.6.7 కోట్లతో మరో రెండు మార్కెట్లకు పరిపాలనా అనుమతులు లభించాయి. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఎదురుగా ఒకటి, చిలకలగూడలో మరొక మార్కెట్ నిర్మించాలని కూడా ప్రతిపాదించారు.
మార్కెట్లోకి దారాళమైన వెలుతురు ప్రసరించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కూరగాయలను అమ్మేందుకు వీలుగా విశాలమైన ప్లాట్ఫారమ్లు, విక్రయదారులు తమ స్టాళ్ల ముందు కూర్చోవడానికి తగిన స్థలం, బల్బులు, ఫ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త మార్కెట్లన్నింటిలోనూ పార్కింగ్ స్థలం కూడా ఉంటుంది.
పంజాగుట్ట, నారాయణగూడ, అమీర్పేట్లలో నిర్మించే మార్కెట్లో నాలుగు అంతస్తుల నిర్మాణాలు, సెల్లార్, స్టిల్ట్ ఫ్లోర్తో వాహనాలను పార్కింగ్ చేసేందుకు ప్రత్యేకంగా వినియోగించనున్నారు. అమీర్పేట్ మార్కెట్ 1,174 చదరపు గజాలలో విస్తరించి ఉంది. కార్యాలయ అవసరాల కోసం రెండు గదులతో పాటు 82 దుకాణాలను కలిగి ఉంటుంది. 801 చదరపు గజాలలో పంజాగుట్ట మోడ్రన్ మార్కెట్లో 45 దుకాణాలు, కార్యాలయ అవసరాల కోసం రెండు గదులు ఉంటాయి.
ఈ కొత్త ఆధునిక మార్కెట్లు పూర్తయిన తర్వాత వీధి వ్యాపారులు, వినియోగదారులకు ఎండ, వేడి, వర్షం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో విక్రయించే కూరగాయలు, మాంసం, ఇతర ఉత్పత్తులు ఈగలు, దుమ్ము కారణంగా అపరిశుభ్రతకు గురవుతున్నాయని, కొత్త సౌకర్యాల వల్ల ఈ సమస్యలు తొలగిపోయి పరిశుభ్రత మెరుగుపడుతుందని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఈ మార్కెట్లకు వెళ్లే రోడ్డు మార్గాల్లో ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు ఉండవని అధికారులు తెలిపారు