బరేలీ (ఉత్తరప్రదేశ్) : దేశంలో వైకల్యం ఉన్నవారికి మద్దతుగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుతోంది. దానికితోడు సమాజం వారిని ఎంతో కారుణ్యంతో చూస్తోంది. వికలాంగుల వృద్ధికి స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఇతోధికంగా పాటుపడుతున్నాయి. అలాంటి ఒక ఉదాహరణ బరేలీలోని దబౌరా గ్రామంలో చోటుచేసుకుంది. ఓ సాధారణ టీచర్ 800 మంది వికలాంగ పిల్లలను పాఠశాలలో చేర్చడంలో సాయపడింది.
గంగాపూర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన దీప్మాలా పాండే అనే ఉపాధ్యాయురాలు ఈ పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. ఇందులోభాగంగా, ప్రతి ఉపాధ్యాయుడు కనీసం ఒక పిల్లలనైనా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆమె తన సహధ్యాయులను కోరింది. వారి సాయంతో ఇప్పటివరకు 800 మందికి పైగా వైకల్యం గల పిల్లలుపాఠశాలలో చేరేందుకు సహాయం చేసింది.
దీప్మాలా పాండే ANIతో మాట్లాడుతూ, “నేను ప్రభుత్వ పాఠశాలలో కనీసం ఒక వికలాంగ పిల్లవాడిని చేర్పించేలా నా తోటి ఉపాధ్యాయులను ప్రేరేపించడానికి ‘One Teacher One call ’ అనే ఉద్యమాన్ని ప్రారంభించాను. ఇప్పటి వరకు దాదాపు 800 మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాం అని ఆమె మీడియాతో అన్నారు.
ఇదిలా ఉండగా హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ శనివారం దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజును వికలాంగ పిల్లలతో కలిసి జరుపుకున్నారు. వీరంతా బీహార్ లోని వివిధ ప్రాంతాలనుంచి దత్తత తీసుకున్న దివ్యాంగ పిల్లలు కావడం విశేషం. ఈ 72 మంది వికలాంగ పేద పిల్లలకు మౌలిక వసతులు కల్పించేందుకు, వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు తాను శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాయ్ తెలిపారు.
దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రధాని మోడీ నుంచి మేము ఎంతో స్ఫూర్తి పొందాము, కాబట్టి నేను ఇప్పటి వరకు మొత్తం 72 మంది వికలాంగ పేద పిల్లలను దత్తత తీసుకున్నాను. వారి ఆరోగ్యం, విద్య, వీటన్నింటికీ అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలను కల్పించాను. తద్వారా ఆయాకుటుంబాలకు భారం కొంతైనా తగ్గుతుంది” అని ఆయన అన్నారు.
సికింద్రాబాద్ లో నిర్వహించిన ప్రధాని మోడీ బర్త్ డే వేడుకల్లో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… మోడీ పుట్టిన రోజు సందర్భంగా దివ్యాంగులకు ఉపకరణాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ…“ప్రధానమంత్రి మోడీ చేసిన అతి పెద్ద పని ఏమిటంటే, పుట్టుక లేదా ప్రమాదం వల్ల కలిగే వైకల్యానికి గౌరవప్రదమైన పేరు పెట్టడం. అలాంటి వారిని దివ్యాంగులుగా పిలిచి పూర్తి గౌరవంతో జీవించే హక్కును మోదీ కల్పించారు. పూర్వం ప్రజలు ప్రత్యేక సామర్థ్యం ఉన్నవారిని కరుణతో చూసేవారు, కానీ ఇప్పుడు వారు వారిని గౌరవంగా చూస్తున్నారు.
వికలాంగుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో పథకాలు రూపొందించారని అమిత్ షా అన్నారు. దృష్టి లోపం ఉన్నవారు కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా ప్రతి రూపాయి నోటు కూడా బ్రెయిలీ లిపిలో ముద్రించారు. బ్రెయిలీ లిపిలో కరెన్సీని ప్రింట్ చేసిన ఏకైక దేశం భారతదేశం అని అమిత్ షా అన్నారు.
అంతే కాదు… ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులకు సులువుగా లిఫ్ట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామని, అలాగే ప్రజా రవాణాలో వికలాంగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.