వరంగల్: ‘జై తెలంగాణ, జై భారత్’ ఇక నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొత్త నినాదం కానుంది. త్వరలో జాతీయ రాజకీయాల్లోకి దూసుకురావాలనే ఉద్దేశంతో కేసీఆర్ తొలిసారిగా ఈ నినాదం ఇచ్చారు. శనివారం వరంగల్లో జాతీయ రహదారి-163పై ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ తన ప్రసంగం ముగింపులో ఈ నినాదాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ… దేశ భవిష్యత్తు యువతతో పెనవేసుకుపోయిందని అన్నారు. మిలీనియల్స్ సవాలును ఎదుర్కోవాలని ఆయన ఉద్బోధించారు. తెలంగాణ అద్బుతమైన అభివృద్ధిని సాధించినప్పటికీ, తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు విద్వేషం రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వీటిని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతూ.. కేంద్ర మంత్రులు రాష్ట్రాన్ని సందర్శించి, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రానికి అవార్డులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణను అభివృద్ధి చెందని రాష్ట్రంగా ముద్రవేసినప్పటికీ కేంద్రమంత్రుల చెంప చెళ్లుమనిపించేలా… రాష్ట్రం వివిధ రంగాల్లో ఎన్నో అవార్డులు కైవసం చేసుకుందన్నారు. తెలంగాణను ధనిక రాష్ట్రంగా పునరుద్ఘాటించిన కేసీఆర్, భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై కంటే రాష్ట్ర తలసరి ఆదాయం మెరుగ్గా ఉందని అన్నారు.
ఆరోగ్య రంగంలో అద్భుత విజయాలు..
ఆరోగ్యం రంగంలో కూడా అద్భుతాలు సాధించాం. మరిన్ని విజయాలు సాధించాలి. 2014 కంటే ముందు ఐదు కాలేజీలు మాత్రమే ఉండే. కొత్తగా 12 కాలేజీలు మంజూరు చేశాం. మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్రం వివక్ష చూపించింది. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు మంజూరు చేశాం. త్వరలోనే అన్ని కాలేజీలు ప్రారంభమవుతాయి. హరీశ్రావు సారథ్యంలో ఇది సాధ్యమైంది. 2014కు ముందు 2800 మెడికల్ సీట్లు ఉండేవి. ఇప్పుడు 6500 మెడికల్ సీట్లు ఉన్నాయి. అన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే దాదాపు 10 వేలు కూడా దాటే అవకాశం ఉంది. మన విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్కు వెళ్లే అవకాశం కూడా రాదు. పీజీ సీట్లు 1150 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 2500కు చేరింది. ఆరోగ్య రంగంలో చాలా బాగా పురోగమిస్తున్నాం. తెచ్చుకున్న తెలంగాణ దేశానికే ఒక మార్గదర్శకంగా మారిందన్నారు కేసీఆర్.
వరంగల్ కేంద్ర కారాగారం స్ధలంలో నిర్మించనున్న మల్టీ లెవల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్తో పాటు పొరుగు జిల్లాలకు జీవనాడిలా మారుతుందన్నారు. ఆసుపత్రిలో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి, హైదరాబాద్ నుండి కూడా రోగులను ఆకర్షించవచ్చుని సీఎం అన్నారు.