హైదరాబాద్: మెట్రో రైల్ ప్రయాణికులకు.. హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం శుభవార్త వినిపించింది. ప్రయాణీకుల క్యూలైన్ కష్టాలకు చెక్ పెట్టింది. లైనులో నిలబడే పని లేకుండా వాట్సాప్లోనే టికెట్ వచ్చేలా హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ సిగ్నేచర్ ప్రోగ్రాంకు అనుగుణంగా ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండ్-టు-ఎండ్ డిజిటల్ చెల్లింపును ప్రారంభించిన భారతదేశపు మొదటి మెట్రోగా రికార్డు సృష్టించింది. ఈ వెసులుబాటుతో ప్రయాణికులకు టికెట్ బుకింగ్ విషయంలో మరింత ఉపశమనం కలగనుంది.
గత కొన్ని నెలలుగా అనేక ట్రయల్స్ తర్వాత, హైదరాబాద్ మెట్రో రైల్ సాంకేతిక అనుసంధానం కోసం సింగపూర్లోని Billeasy, AFC భాగస్వామి ShellinfoGlobalsgతో కలిసి ప్రముఖ మెసెంజర్ యాప్ అయిన WhatsApp ద్వారా డిజిటల్ టిక్కెట్ బుకింగ్ యొక్క కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ సరికొత్త సాంకేతికతతో రోజువారీ హైదరాబాద్ ప్రయాణికులకు మెట్రోలో సజావుగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రయాణీకులు ఇప్పుడు వారి స్వంత వాట్సాప్ నంబర్లో ఇ-టికెట్ను కొనుగోలు చేయవచ్చు.
వాట్సాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోండిలా..
- హైదరాబాద్ మెట్రో రైలు ఫోన్ నంబర్ 918341146468 కు వాట్సప్లో ‘హాయ్’ అని మెస్సెజ్ చేయండి. లేదా మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేయండి.
- వెంటనే మీకు ఒక ఓటీపీ (OTP) మరియు ఈ-టికెట్(e-Ticket) బుకింగ్ యూఆర్ఎల్ (URL) వస్తుంది. ఈ ఓటీపీ, యూఆర్ఎల్ 5 నిమిషాల వరకు చెల్లుబాటు అవుతుంది.
- వచ్చిన ఈ-టికెట్ బుకింగ్ యూఆర్ఎల్ను క్లిక్ చేయండి.
- జర్నీ రూట్ మరియు జర్నీ టైప్ను సెలక్ట్ చేసుకోండి. అనంతరం డిజిటల్ పేమెంట్ యాప్ ((Gpay, PhonePe, Paytm) లు లేదా డెబిట్, క్రెడిట్ కార్టుల ద్వారా నగదు చెల్లించండి.
- అనంతరం మీ రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్కు మెట్రో ఈ-టికెట్ యూఆర్ఎల్ వస్తుంది.
- ఆ యూఆర్ఎల్ను క్లిక్ చేస్తే.. మీ క్యూఆర్ ఈ-టిక్కెట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఈ టికెట్ ఆ రోజుకు మాత్రమే పని చేస్తుంది.
- వచ్చిన క్యూఆర్ ఈ-టికెట్ను ప్లాష్ చేసి.. ఎంచక్కా మెట్రో రైల్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి.
దేశంలోనే మొట్ట మొదటిసారిగా..!
బిల్ ఈజీ ఫౌండర్, ఎండీ ఆకాశ్ దిలీప్ పాటిల్ మాట్లాడుతూ… “L&T మెట్రో రైల్ హైదరాబాద్తో భాగస్వామ్యం కావడం, మా ప్రభుత్వ మిషన్ ‘డిజిటల్ ఇండియా’కు మద్దతు ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. దేశంలో రవాణా వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి తమ సంస్థ పలు అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నదని తెలిపారు. వాట్సాప్ ద్వారా దేశంలోనే ఆన్లైన్ టికెట్ను మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థతో కలిసి అందిస్తున్నామని పేర్కొన్నారు. డిజిటల్ మొబిలిటీ సొల్యూషన్లను అవలంబిస్తూనే దేశంలో ట్రాన్సిట్ ఎకోసిస్టమ్ను డిజిటలైజేషన్ చేసే దిశగా మేము పని చేస్తూనే ఉంటాము. ప్రతి ఒక్కరూ డిజిటలైజేషన్, ఇన్నోవేషన్లో గొప్ప స్థాయిలో పాలుపంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.