హైదరాబాద్: సిటీ ఆఫ్ పెరల్స్గా పేరుగాంచి విశ్వనగరం హైదరాబాద్లో చారిత్రక, పర్యాటక ప్రదేశాలు బోలెడు ఉన్నాయి. పురాతన ప్యాలెస్లు, కోటలు, రుచికరమైన బిరియానీ, హలీంలకు ప్రసిద్ది ఈ నగరం. నిజాంల పాలనలో ఎంతో వైభవంగా వెలిగిన హైదరాబాద్ను జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని ప్రతి పర్యాటకుడు కోరుకుంటాడు. అలాంటి ఔత్సాహికుల కోసం టీఎస్ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శన్’ పేరిట సరికత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ సర్వీసులను ఉపయోగించుకుని యాత్రికులు నగరంలోని పర్యటక, చారిత్రక కట్టడాలను 12 గంటల్లో చుట్టేసి వచ్చే విధంగా షెడ్యూల్ సిద్ధం చేశారు.
ఈమేరకు హైదరాబాద్లోని పర్యాటక ప్రదేశాలను దర్శించడానికి వచ్చే యాత్రికుల కోసం టిఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ “హైదరాబాద్ దర్శిని” పేరిట రెండు స్పెషల్ బస్సులను ప్రారంభించారు. నగరంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ.. నగరంలోని పర్యాటక, చారిత్రక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ బస్సు సర్వీసులను నడపడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. హైదరాబాద్ నగర టూరిస్టులకు అనుకూలంగా ఆర్టీసీ “హైదరాబాద్ దర్శిని” బస్సు సర్వీసులను ప్రవేశపెట్టిందని ఆర్టీసీ ఛైర్మన్ తెలియజేశారు.
సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్ సమీపంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే బస్సు బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్కు పర్యాటకులను తీసుకువెళుతుంది. తారామతి బారాదరి రిసార్ట్లోని హరిత హోటల్లో లంచ్ షెడ్యూల్ చేశారు. గోల్కొండ కోట, దుర్గం చెరువు పార్కును సందర్శించిన తర్వాత బస్సు ప్రసిద్ధ కేబుల్ వంతెన మీదుగా ఎన్టీఆర్ పార్క్, హుస్సేన్ సాగర్ వైపు వెళుతుంది. రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్లోని ఆల్పా హోటల్కు తిరిగి చేరుకోవడంతో టూర్ పూర్తి అవుతుంది.
వారాంతాల్లో సరదాగా.. రోజంతా ఉత్సాహంగా హైదరాబాద్ సిటీ మొత్తం చుట్టేద్దామనుకునే వాళ్లకు ఇది ఓ బంఫర్ ఆఫర్ అని చెప్పాలి.
మెట్రో ఎక్స్ప్రెస్లో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుకు రూ.450, రూ.340గా నిర్ణయించారు.
హైదరాబాద్ దర్శన్ సర్వీస్ టిక్కెట్లను www.tsrtconline.inలో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.మరింత సమాచారం కోసం 040-23450033 లేదా 040-69440000 నంబర్లో సంప్రదించవచ్చు.
హైదరాబాద్ దర్శనం:
*ఆల్ఫా హోటల్ – ఉదయం 8.30.
* బిర్లా మందిర్ – ఉదయం 9 నుండి 10 వరకు.
*చౌమహల్లా ప్యాలెస్ – ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు.
*తారామతి బారాదరి రిసార్ట్స్ – మధ్యాహ్నం 1 నుండి 1.45 వరకు.
*గోల్కొండ కోట – మధ్యాహ్నం 2 నుండి 3.30 వరకు.
*దుర్గం చెరువు – సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు.
* కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ – సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు.
*హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్ – సాయంత్రం 6.30 నుండి 7.30 వరకు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందిస్తున్న అద్భుతమైన అవకాశాలను విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రకృతి ప్రేమికులు, విహారయాత్రలు చేసేవారు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు.