హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ క్లస్టర్ జీనోమ్ వ్యాలీలో ఒకేసారి ఐదు ప్రాజెక్టులకు మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన చేశారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్లో భాగం కాబోతున్న ఈ కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి రూ. 1,100 కోట్ల పెట్టుబడులను తెస్తాయని మంత్రి అన్నారు. తద్వారా రాష్ట్రంలోని దాదాపు 3,000 ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయన్నారు.
టీ-హబ్ తరహాలో ఏర్పాటుచేయనున్న ప్రతిష్ఠాత్మక బయోఫార్మా హబ్ (బీ-హబ్)కు శంకుస్థాపన చేశారు. జీవీ-1 అనే మరో కొత్త ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. ఇప్పటికే కొనసాగుతున్న ఇన్నోపోలిస్, టచ్స్టోన్, ఏఆర్ఎక్స్లకు చెందిన రెండో దశ కోసం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జినోమ్ వ్యాలీలో స్థలానికి డిమాండ్ పెరుగుతోందన్నారు. అనేక కొత్త కంపెనీలు రావడంతో పాటు ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ విస్తరణను చేపట్టాయని పేర్కొన్నారు. దీంతో రానున్న రోజుల్లో 20 లక్షల చదరపు అడుగుల స్థలం అదనంగా తోడవుతుందని వెల్లడించారు.
జీనోమ్ వ్యాలీలో ప్రస్తుతం సుమారు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200లకుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఏర్పాటయ్యాయని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాంతం అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా అవతరించిందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో దేశంలోనే ప్రధాన కేంద్రంగా ఎదిగిందని వివరించారు. దేశంలో ఎక్కడా లేనంతగా ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం జీనోమ్ వ్యాలీలో ఉన్నది. దీనిని ఇంకా విస్తరిస్తున్నాం. ఇక్కడ సీఆర్ఓలు, సీడీఎంఓలు ఉన్నాయి. సింజీన్, లారస్, క్యూరియా తదితర అనేక సీఆర్ఓలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రానున్నాయి’ అని తెలిపారు.
వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు బయోలాజికల్-ఈ లిమిటెడ్, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్తోసహా పలు కంపెనీలు రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టాయని వెల్లడించారు. స్టెరైల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు చెందిన ఫార్మా కంపెనీ హెటిరో 750 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిందని, ప్రముఖ అంతర్జాతీయ ఔషధ సంస్థ రోచె తన గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. జీనోమ్ వ్యాలీలో డిమాండ్, కంపెనీల రాకను బట్టి తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం 2030 లక్ష్యానికి ముందుగానే 100 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకొంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
మంత్రి కేటీఆర్ ప్రారంభించిన కంపెనీల వివరాలు:
1. జీనోమ్ వ్యాలీలో Rx Propellant ద్వారా 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ది చేసే క్యూరేటెడ్ లైఫ్ సైన్సెస్ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాలను అందించడానికి Rx Propellant మరియు దాని అనుబంధ సంస్థలు రూ.900 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.
2. Yapan Bio’s ప్రాసెస్ డెవలప్మెంట్ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
3. పలురకాల ప్రీక్లినికల్ రీసెర్చ్ సేవలను అందించే GV రీసెర్చ్ ప్లాట్ఫారమ్ (GVRP) అత్యాధునిక సౌకర్యాన్ని మంత్రి ప్రారంభించారు. 28,000 చ.అ.విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫెసిలిటీ లో వెటర్నరీ సైన్స్, టాక్సికాలజీ, ఫార్మకాలజీ మరియు ఎనలిటికల్ రీసెర్చ్ డొమైన్లలో పనిచేసే నిపుణులు తమ పరిశోధన కార్యకలాపాలు నిర్వహిస్తారు.
4. Neovantage Park (MN పార్క్)లో VIMTA ల్యాబ్స్ యొక్క అత్యాధునిక EMI/EMC ల్యాబ్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇది యాక్టివ్ మెడికల్ డివైసెస్, వైర్లెస్, డిఫెన్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ సెక్టార్ల ESDM అవసరాలకు ఉపయోగపడేలా అధునాతన మరియు సంక్లిష్టమైన పరీక్షలను నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమాల్లో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ & ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, అయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Delighted to have inaugurated and launched 5 new projects in @Genomevalley @TS_LifeSciences with a cumulative investment of ₹ 1100 crores and employment potential of about 3000 people pic.twitter.com/8v6D4uybZV
— KTR (@KTRTRS) October 18, 2022