హైదరాబాద్: కాగజ్నగర్ మండలం అందెవెల్లి గ్రామ సమీపంలో పెద్దవాగు వాగుపై నిర్మించిన అందవెల్లి బ్రిడ్జి మంగళవారం అర్ధరాత్రి కుప్పకూలింది. బ్రిడ్జిలో అధిక భాగం ధ్వంసమైంది. అప్పటికే రాకపోకలు నిలిపేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీ వర్షాల కారణంగా జులైలో ఈ వంతెన కుంగిపోవండంతో ఈ బ్రడ్జిపై నుండి రాకపోకలను నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు.
బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వంతెన యొక్క రెండు స్తంభాలు, మూడు స్లాబ్లు ఒక్కసారిగా కూలిపోయాయి. స్థానికులు వంతెనను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది బాగా వైరల్ అయింది.
విషయం తెలుసుకున్న సిర్పూర్ (టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామ్మోహన్ వంతెనను పరిశీలించారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కోనప్ప పేర్కొన్నారు. రూ.3 కోట్లతో పిల్లర్ మరమ్మతులు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, స్థానిక పోలీసులు బ్రిడ్జి ప్రవేశద్వారం వద్ద అడ్డుగా గోడలను నిర్మించారు. ట్రాఫిక్ను నిషేధించారు. వాహనదారులు కాగజ్నగర్కు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. దహేగాం, బెజ్జూరు,కాగజ్ నగర్ వాసులు ఈ వంతెనను ఉపయోగిస్తారు. ఈ వంతెన కూలిపోవడంతో సుదూర ప్రాంతాల గుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
అందవెల్లి బ్రిడ్జి కూలిపోవడంతో చాలా ప్రజలు మంచిర్యాల జిల్లా తాండూరు, బెల్లంపల్లి మీదుగా కాగజ్ నగర్కు చేరుకుంటున్నారు. ఇంత దూరం ( 50 కిలోమీటర్లు) ప్రయాణం చేయాలంటే సమయంతో పాటు ఖర్చు కూడా పెరగనుంది. దీంతో ఈ వంతెన దాటడానికి నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22న పెద్దవాగును నాటు పడవ ద్వారా దాటుతున్న నలుగురు ప్రమాదానికి గురయ్యారు.వాగులో నీటి ఉధృతికి నాటు పడవ బోల్తా పడింది. అయితే వాగులో కొట్టుకుపోతున్న నలుగురిని అక్కడే ఉన్న స్థానికులు రక్షించారు.
ప్రపంచ బ్యాంకు నిధులతో పంచాయత్ రాజ్ శాఖ 2001లో నిర్మించిన ఈ వంతెన దహెగా, భీమినిలోని అనేక గ్రామాలను కాగజ్ నగర్ పట్టణానికి కలుపుతుంది. జగన్నాథ్పూర్-అండెవెల్లి మార్గంలో రెండు మండలాల వాసులు కిరాణా, వైద్య అత్యవసరాల కోసం పట్టణానికి వెళ్లేందుకు ఉపయోగిస్తారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సైతం ఈ వంతెనపైనుంచే ప్రయాణిస్తుంటారు.