హైదరాబాద్: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా దీపాల పండుగను జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీపావళి సంబరాలు అంబరాన్నింటాయి. అయితే టపాసులు కాల్చే టైంలో చేసే చిన్న చిన్న పొరపాట్లతో నిన్న హైదరాబాద్ నగరంలో జరిగిన దీపావళి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. నగరంలో పలుచోట్ల బాణసంచా కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో 24మంది గాయపడ్డారు.
వీరిలో చాలా మందికి కంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో బాధితులు మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. గాయపడ్డవారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించి కంటిచూపు దెబ్బతినకుండా డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన 12 మందికి కంటికి తీవ్రమైన గాయాలు కావడంతో ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఇక, జిల్లాల నుంచి కూడా గాయాలతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నందు వల్ల మంగళవారం మధ్యాహ్నం వరకు కేసులు పెరుగుతాయని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి అధికారులు తెలిపారు. పటాకులు పేల్చడం వల్ల కలిగే గాయాలకు సంబంధించిన కేసులకు మెరుగైన చికిత్స అందించేందుకు సీనియర్ వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఆస్పత్రి అధికారులు ఏర్పాటు చేశారు.
ఇదిలావుండగా, దీపావళి సందర్భంగా నిషేధిత పటాకులు విక్రయిస్తున్న వ్యాపారులు, దుకాణాలపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ) ఇటీవల కఠినంగా వ్యవహరించింది. నిబంధనలు పాటించని వారిని గుర్తించేందుకు కాలుష్య మండలి అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.