న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ ఆనంద భాస్కర్ రాపోలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేశారు. గడిచిన నాలుగేండ్ల కాలంలో జాతీయ స్థాయిలో నన్ను విస్మరించారు. ఎన్నోసార్లు అవమానించారు. తక్కువ చేసి చూశారు. జాతీయస్థాయిలో ప్రాధాన్యం లేకుండా చేశారు. అయినప్పటికీ, ఆ ఆవేదనను దిగమింగుతూనే వచ్చా. ఇదే నా తలరాతగా భావించా. ఇప్పుడు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాథమిక ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని ఆనంద భాస్కర్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
సామాజిక భద్రత, సామాజిక న్యాయం, సామాజిక సాధికారత అనే వాటిని పార్టీ పట్టించుకోవట్లేదు. జనాభాలో కులగణనకు పార్టీ, కేంద్రప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. అప్పటి నుంచి నాలో భయం మొదలైంది. ప్రాంతీయత, భాషలు, స్థానిక ప్రజల భావోద్వేగాలను ఉద్దేశపూర్వకంగా చిన్నచూపు చూడడం పార్టీకి అలవాటుగా మారింది. ఏకభాషా పెత్తనాన్ని ప్రోత్సహించడం ఎక్కువైంది. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నది. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన అవకాశాలను అందకుండా చేస్తున్నదని రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల భూగర్భజలాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పైకి ఉబికి వచ్చాయి. నదీజలాల నిండు గర్భంగా తెలంగాణ మారింది. దీంతో వాతావరణ పరిరక్షణే కాకుండా నీటి పారుదల వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది. తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారింది. ఇన్ని జరుగుతున్న తెలంగాణను పొగడాలని నేను అడగట్లేదు. అయితే, బీజేపి తెలంగాణ శాఖ అధికారానికి రావాలనే ఆసక్తితో ఉన్న వారిలా బాధ్యతతో వ్యవహరించడం లేదన్నది మీ నాయకత్వం గమనిండం లేదా? అని లేఖలో ప్రశ్నించారు రాపోలు.. తెలంగాణ ప్రజలు అత్యంత తెలివైనవారు. వారికేమీ గుర్తుండవని అనుకొంటున్నారు. అది మాత్రం నిజంకాదన్నారు.