హైదరాబాద్: నవంబర్ 9న ప్రపంచ ఉర్దూ దినోత్సవం సందర్భంగా… హైదరాబాద్ ఆర్ట్స్ అండ్ కల్చర్ కమ్యూనిటీ (హెచ్ఎసిసి) షాంగ్రిలాస్ లిటరరీ ఫోరమ్తో కలిసి నవంబర్ 8న ఉర్దూ లిటరరీ-మ్యూజిక్ ఫెస్టివల్ను నిర్వహిస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది.
‘సారే జహాన్ సే అచ్ఛా హిందూస్థాన్ హమారా’ అనే గీతాన్ని రచించిన విశ్వకవ డాక్టర్ సర్ అల్లామా మహమ్మద్ ఇక్బాల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 9న ప్రపంచ ఉర్దూ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. రవీంద్రభారతిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రఖ్యాత భారతీయ కళాకారులచే ప్రదర్శించబడే మెహ్ఫిల్-ఎ-ముషాయిరా, షామ్-ఎ-గజల్, మెహ్ఫిల్-ఎ-ఖవ్వాలి కూడా ఈ కార్యక్రమంలో ఉంటాయి.
అంతేకాదు ప్రపంచ ఉర్దూ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో యువ, ఔత్సాహిక కళాకారులకు తమ కవితలు, సంగీతాన్ని కూడా ఈ వేదిక ద్వారా అందించేందుకు అవకాశం కల్పించనున్నారు.
సీనియర్ కవులుగా షబీనా అదీబ్, జౌహర్ కాన్పురి, సర్దార్ సలీమ్ ప్రసంగిస్తారు. నగరానికి చెందిన పలువురు యువ కవులతో కలిసి మెహ్ఫిల్ ఇ ముషైరాలో వారి కవితలు వినిపించనున్నారు. ఉస్తాద్ సాబెర్ హబీబ్, గజల్ మాస్ట్రో గాయకుడు సోహైల్ హుస్సేన్తో కలిసి గజల్స్ పాడతారు. షుజాత్ నియాజీ కవాలీ రూపంలో కలాం-ఎ-ఇక్బాల్ను ప్రదర్శిస్తాడు.
ఉర్దూ ఔన్యత్యం
ఉర్దూ భాష చాలా సరళంగా ఉంటుంది. దీంతో ఉర్దూను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉర్దూ భాష తన సత్తాను చాటుతోంది. 250 కంటే ఎక్కువ దేశాలలో ఉర్దూ వాడుకలో ఉంది. అల్లామా ఇక్బాల్ తన నజమ్ల ద్వారా ప్రపంచంలో ఉర్దూకు అందించిన స్థానం అభినందనీయం. మన దేశంలో కూడా ఉర్దూ సాధారణ భాష. పెద్ద సంఖ్యలో ప్రజలు ఉర్దూ మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు కాబట్టి మన దేశంలో ఉర్దూ ఇప్పటికీ సజీవంగా ఉంది. ప్రభుత్వంలో కూడా ఉర్దూను రక్షించడానికి అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. మన దైనందిన జీవితంలో ఉర్దూ భాషా అభ్యాసాన్ని కూడా సాధారణం చేయాలి.