హైదరాబాద్ : మహానగరంలో అత్యంత మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైల్, టీఎస్ఆర్టీసీ ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్ నగరంలో మెట్రో స్టేషన్లనుండి సులభంగా ఇళ్లకు చేరేందుకు వీలుగా మరింత సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను అందించే ఒప్పందంపై సంతకం చేశారు.
ఎల్ అండ్ టి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మురళీ వరద రాజన్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రిషికుమార్ వర్మ, టిఎస్ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ను శనివారం బస్ భవన్లో కలిశారు, ఈ సందర్భంగా ఈ రెండు ప్రజారవాణా సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదిరింది.
ఈ సందర్భంగా ఆర్టిసి ఎండీ వి.సి. సజ్జనార్ మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా బస్సులు నడపనుంది. అంటే మెట్రో రైలు దిగగానే బస్సులో ప్రయాణించేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. దీనికి సంబంధించి సర్వీసుల టైంటేబుల్, సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు. అంతేకాదు మెట్రో స్టేషన్లలో సమాచార కేంద్రాలు, మైక్ ద్వారా అనౌన్స్మెంట్కు కూడా ఏర్పాట్లు చేయనున్నారు.
మెట్రో సర్వీస్తో పాటు టిఎస్ఆర్టిసి బస్సులను నడపడానికి ప్రత్యేక చర్యలపై పరస్పరం నిర్ణయాలు తీసుకుంటారు. ఇది చారిత్రాత్మక ఒప్పందం అని పేర్కొన్న సజ్జనార్, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ట్రాఫిక్ జామ్లను నివారించడానికి ఈ నిర్ణయం ఉపయోపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.