హైదరాబాద్: నకిలీ సర్టిఫికెట్ల ముప్పును అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లలో, ముఖ్యంగా మార్కుల మెమోలలో స్మార్ట్ చిప్లను పొందుపరచాలని యోచిస్తోంది. ఇప్పటికే ప్రతి సర్టిఫికేట్కు లోగో, వాటర్మార్క్, ప్రత్యేకమైన కోడ్ నంబర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పటినుంచి సర్టిఫికెట్లలో అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్ తీసుకొస్తున్నారు. ప్రస్తుత సర్టిఫికేట్లకు భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ, అడ్మిషన్, ఉద్యోగాల ప్రయోజనం కోసం అసాంఘిక శక్తులు ట్యాంపరింగ్ చేయడం, నకిలీ సర్టిఫికేట్లను సృష్టించడం చేస్తున్నారు.
విద్యార్థుల సర్టిఫికేట్లలో కొత్త స్మార్ట్ చిప్ ఫీచర్లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల అకడమిక్ ఆధారాలను పొందుపరుస్తారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు అందించే అన్ని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా సర్టిఫికేట్లకు ఈ సదుపాయాన్ని కల్పిస్తారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ల సహకారంతో సర్టిఫికేట్లలో స్మార్ట్చిప్ అమర్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
నకిలీ సర్టిఫికెట్లు తయారీ విస్తృతం కావడంతో యూనివర్సిటీలు జారీ చేసే సర్టిఫికెట్లలో కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకురావాల్సిన అవసరం ఉందని సీనియర్ అధికారి ఒకరు సూచించారు.
ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నకిలీ సర్టిఫికెట్ల ముప్పును అరికట్టేందుకు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ (SAVS) వెబ్సైట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తద్వారా సర్టిఫికెట్లను సులభంగా, అత్యంత వేగంగా ఒకే ఒక్క క్లిక్తో ఈ పోర్టల్ ద్వారా వెరిఫికేషన్ చేయింకోవచ్చు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. వెబ్సైట్లో రాష్ట్రంలోని 15 వర్సిటీల పరీక్షల విభాగాలు ఇచ్చిన అధికారిక సమాచారాన్ని పొందుపరిచారు.
అభ్యర్థుల హాల్టికెట్ నంబర్ను నమోదు చేస్తే.. సర్టిఫికెట్ అసలుదో.. నకిలీదో తెలుసుకునేలా స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ (SAVS) వెబ్సైట్లో ఏర్పాట్లు చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు, ప్రవేశాలు కల్పించే విద్యాసంస్థలు ఈ పోర్టల్ ద్వారా సులభంగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవచ్చని, విద్యార్థుల మెమోలు కావాలనుకుంటే ఆన్లైన్లో డిజిటల్ సంతకం చేసి పంపిస్తారు.
సర్టిఫికెట్ అసలుదో.. నకిలీదో స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ (SAVS) వెబ్సైట్లో ధృవీకరించాక వివరాలు క్లయింట్కు ఆన్లైన్లో అందిస్తారు. పూర్తి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రూ.1,500 రుసుము వసూలు చేస్తారు. ప్రస్తుతం, పోర్టల్లో 2010 – 2021 మధ్య రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల నుండి పట్టభద్రులైన 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఉంది.