హైదరాబాద్: డిజిటల్ విస్తరణలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ త్వరలో ఆన్లైన్ కోర్సులను ప్రారంభించనుంది. నిన్న ఓయూ క్యాంపస్లోని సెంటర్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (సిడిఇటి)లో కొత్త స్టూడియో సౌకర్యాన్ని ప్రారంభించిన ఓయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. రవీందర్ మాట్లాడుతూ టి-శాట్ ద్వారా టెలికాస్ట్ చేయడంతో పాటు, యూట్యూబ్లో లెక్చర్ వీడియోలను పోస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఆన్లైన్ కోర్సులను రూపొందించే పనిలో ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఆన్లైన్ కోర్సుల కోసం ఇ-కంటెంట్ను రూపొందించడంలో సిడిఇటిలోని కొత్త సౌకర్యాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.పి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం వల్ల విశ్వవిద్యాలయం, విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ఓఎస్డీ టు ఓయూ వీసీ ప్రొఫెసర్ బి. రెడ్యా నాయక్ మాట్లాడుతూ… డిజిటల్ టెక్నాలజీలు ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని, సిడిఇటిలో కొత్త సౌకర్యం… యూనిర్సిటీకి దూరంగా ఉన్నవారి దగ్గరకు విద్యను తీసుకువెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సిడిఇటి డైరెక్టర్ ప్రొఫెసర్ కె స్టీవెన్సన్ మాట్లాడుతూ… ఈ స్టూడియో సదుపాయం యూనివర్సిటీలోనే మొట్టమొదటిదని, ఉస్మానియా విద్యార్థులతో పాటు వివిధ దేశాల్లో ఉన్న విద్యార్థుల కోసం డిజిటల్ కంటెంట్ను ఉత్పత్తి చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు.
సీడీఈటీ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ఆర్ గిరిధర్ కేంద్రం కార్యకలాపాలకు సంబంధించిన ప్రణాళికలను వివరించారు. మద్దతు ఇచ్చినందుకు యూనివర్సిటీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రొ. జి.రాంరెడ్డి దూర విద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్. GB రెడ్డి దూరవిద్య విద్యార్థులకు అందించే వనరులను విస్తరించడానికి CDET ముందుకు రావాలని ఆకాంక్షించారు.