ఖమ్మం: ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేయాలని నిర్ణయించిన ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఇటీవల బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ను తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా నియమించారు. తాజాగా ఖమ్మం బహిరంగ సభలో శంఖారావం పూరించి… తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఊపు తీసుకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాలుగేళ్ల క్రితం ఖమ్మంలో రాహుల్ గాంధీతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. తాజాగా చంద్రబాబు ఖమ్మం పర్యటనపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక్క టీడీపీకే ఉందని.. ఎందుకంటే తెలంగాణలో ప్రాజెక్టులు తీసుకొచ్చింది, హైదరాబాద్ని అభివృద్ధి చేసింది టీడీపీనే అని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో తమకు ఒక్క ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ, ఎంపీ గానీ లేకపోయినా ఇవాళ ఖమ్మం సభకు తరలివచ్చిన ప్రజల్ని చూస్తుంటే ధైర్యం కలుగుతోందన్నారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడా? అని ప్రశ్నించే వాళ్లకు ఖమ్మం సభే సమాధానమని స్పష్టం చేశారు.
టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని, భవిష్యత్తుకు నాంది పలకబోతోందని చెప్పిన చంద్రబాబు.. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు, శక్తి అని కీర్తించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం అందించారని.. మండల వ్యవస్థ, సింగిల్ విండో విధానం అమలు చేసి పేదలకు పక్కా భవనాలు నిర్మించి ఇచ్చారని చెప్పారు. తాను కోరుకున్నది అధికారం కాదని, ప్రజల అభిమానమని.. ఎన్నికలు, ఓట్ల కోసం తానెప్పుడూ పని చేయలేదని అన్నారు.
తాను వయసులో పెద్దవాడినైనా యువత కంటే ముందు చూపుతో ఆలోచిస్తానని.. ఐటీ రంగం ప్రాధాన్యతను తాను 25 ఏళ్ల క్రితమే గుర్తించానని పేర్కొన్నారు. బిల్ గేట్స్ని కలిసి.. భారతీయుల మేధాశక్తి ఎలాంటిదో వివరించానన్నారు. డిజిటల్ సత్తాలో మనతో పోటీ పడేవాళ్లు ఎవరూ లేరన్నారు.
ఏపీ రెండు రాష్ట్రాలుగా మారినా.. తాను వేసిన ఫౌండేషన్నే తెలంగాణలో కొనసాగించారన్నారన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసి, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలన్న ఆశ ఉందన్న ఆయన.. ఏపీలో గాడి తప్పిన పాలనను ఆదుకోవాలని కాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, కలిసి పని చేస్తే దేశానికే ఆదర్శం అవుతాయన్నారు. 40 ఏళ్లు ఏ ప్రజలైతే తనను ఆశీర్వదించారో.. వారి కోసం జీవితాంతం పనిచేస్తానని చెప్పారు. పార్టీ అవసరమనుకున్న వాళ్లు పార్టీలోకి రావాలని.. మళ్లీ తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాలని చంద్రబాబు కోరారు.