హైదరాబాద్: కేవలం నాలుగు నెలల్లోపే మరోసారి ఖిల్వత్-మోతీ గల్లి-మహబూబ్ చౌక్ రహదారిని భారీ వాహనాల రాకుండా మూసివేయడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టిసి) బస్సు ప్రయాణికులు మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డుపై పైపుల ఏర్పాటు పనులు చేపట్టడంతో ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాలు రాకుండా రోడ్డును మూసివేశారు.
మే-జూన్ నెలలలో మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ దగ్గర కొన్ని పనుల కారణంగా దాదాపు ఒక నెల పాటు రహదారి మూసేశారు. ఇప్పుడు మళ్లీ మోతిగల్లి-లాడ్ బజార్ జంక్షన్ నుంచి పనులు ప్రారంభమయ్యాయి. మోతిగల్లి స్ట్రెచ్లో జరుగుతున్న పనుల కారణంగా ఆర్టీసీ బస్సులు దాదాపు 400 ట్రిప్పులు రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ఆశ్చర్యకర విషయమేమిటంటే ఆ మార్గంలో జిహెచ్ఎంసి ద్వారా నెల రోజుల క్రితం కొత్త బీటీ రోడ్ వేసింది. ఇంతలోనే కొత్త రహదారి పైప్లైన్ పనుల కోసం ఎర్త్ మూవర్లను ఉపయోగించి తవ్వుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమన్వయ లేమి ఇక్కడి ప్రజలకు పెద్ద చిక్కొచ్చిపడింది.
ద్విచక్రవాహనం, త్రీవీలర్లు మూసా బౌలి హుస్సేనియాలం రోడ్డుకు చేరుకోవడానికి స్టాండర్డ్ పబ్లిక్ స్కూల్ రోడ్డును ఉపయోగిస్తున్నారు. కార్లు హుస్సేనియాలం – సిటీ కాలేజ్ రోడ్డుకు చేరుకోవడానికి దూద్ బౌలి రహదారిని ఉపయోగిస్తున్నాయి.
“బస్సులకు ప్రత్యామ్నాయ రహదారి లేదు. ఫతే దర్వాజా మీదుగా సిటీ కాలేజీకి దూద్బౌలి లేదా రామా టాకీస్ మీదుగా వెళ్లే దారి చాలా ఇరుకైనది. దీంతో షాలిబండ నుండి అఫ్జల్గంజ్కు వెళ్లే బస్సులను నాగుల్చింత, షంషీర్గంజ్, కాలాపత్తర్, తాడ్బన్, బహదూర్పురా రహదారిపై వెళ్లే జాతీయ రహదారి 44 మీదుగా మళ్లించామని, ”అని TSRTC సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
దీంతో దూరం అనేక రెట్లు పెరుగుతుంది, అంతేకాదు టిక్కెట్ల ధర, ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. మహబూట్ చౌక్ రోడ్డు మూసివేత కారణంగా సగటున ఒక్కో ప్రయాణికుడు బలవంతంగా పదిరూపాయలు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది.
“ప్రయాణికుల నుండి కిలోమీటరు ప్రాతిపదికన బస్సు ఛార్జీలు వసూలు చేస్తారు. దీని కారణంగా చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు టీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ను ఉపయోగించడం లేదు. దానికి బదులుగా సమయాన్ని ఆదా చేయడానికి ఇతర ప్రైవేట్ ఆటో-రిక్షాలపై ఆధారపడుతున్నారని ఆర్టీసీ అధికారి తెలిపారు.
ముఖ్యమైన రూట్లలో వివిధ సమయాల్లో పనులు చేపట్టే బదులు… ఇతర శాఖల అధికారులతో పనులు సమన్వయం చేసుకొని పనులన్ని ఒకేసారి చేపడితే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు