హైదరాబాద్: భారతదేశంలో ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ ముందుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ అధిగమించిదని చెప్పారు. అయితే బెంగళూరును తక్కువ చేసి చూపడం తన ఉద్దేశం కాదని అన్నారు. హైదరాబాద్ను చూసి వ్యాపారవేత్తలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఐటీ రంగంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ను అద్భుతంగా అభివృద్ది చేశామని చెప్పారు. హైదరాబాద్ నార్త్ వైపు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో ఐటీ రంగంలో 40 వేల ఉద్యోగాలు వచ్చాయని మంత్రి తెలిపారు.
నాస్కామ్ గణాంకాల ప్రకారం, గతేడాది ఐటీ రంగంలో భారతదేశంలో 4.50 లక్షల ఉద్యోగాలు వస్తే.. ఇందులో హైదరాబాద్ 1.50 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని, బెంగళూరు 1.46 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించిందని మంత్రి తెలిపారు.
సోమవారం ఇక్కడ ఐటి పరిశ్రమ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఆఫీస్ స్పేస్ వినియోగంలో కూడా బెంగళూరు కన్నా హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ రంగం అభివృద్ది చెందిందని మంత్రి అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం మంది హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి తమకు గర్వకారణం అని పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఏ రాష్ట్రంలోనై సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ది సాధ్యపడుతుందని అన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన నగరం అని కేటీఆర్ చెప్పారు. తొలిరెండు స్పేస్ టెక్ స్టార్టప్లు హైదరాబాద్కు చెందినవేనని అన్నారు. రాష్ట్రంలో టీఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తామని తెలిపారు.
ఐటీ కంపెనీలు హైదరాబాద్ను దాటి తెలంగాణలోని టైర్ II పట్టణాలు, నగరాల్లో తమ కొత్త యూనిట్లను ఏర్పాటు చేసి కార్యకలాపాలను విస్తరించాలని ఐటీ కంపెనీలను ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్లలో ఐటీ హబ్లను ప్రారంభించింది. వచ్చే నెలలో నిజామాబాద్ ఐటీ హబ్ ప్రారంభం కానుంది. రాబోయే నెలల్లో మహబూబ్నగర్, నల్గొండ ఐటీ హబ్లను ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు.