సికింద్రాబాద్: గత కొన్ని సంవత్సరాలలో ఇండియన్ రైల్వేస్ అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. కొన్ని ప్రధాన మార్గాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్లో నేడు ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా రైలుకు సంబంధించి టైమ్టేబుల్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే రైల్వే శాఖ ఈ రైలు బుకింగ్స్ను ప్రారంభించింది. సోమవారం నుంచి ప్రయాణానికి గానూ ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రతి రోజు నడవనున్న ఈ రైలు… వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లలో ఆగుతుంది. కాగా… వందే భారత్ రైలులో ఛైర్ కార్ ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి..
సికింద్రాబాద్ నుంచి వరంగల్ కు ఛార్జి రూ. 520
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం రూ. 750
సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రూ. 905
సికింద్రాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఛార్జి రూ. 1,365
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రూ. 1,665
ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ చార్జీలు… సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రూ. 3120 గా ఉంది.
14 ఏసీ ఛైర్ కార్ కోచ్ లు, రెండు ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్లు కలిపి మొత్తం 16 కోచ్లతో కూడిన రైలులో 1,128 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు వందేభారత్ రైలు సేవలందిస్తుంది. విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు ( ట్రైన్ నెం. 20833) ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే వందే భారత్ రైలు.. రాత్రి 11.30 గంటలకు… అంటే కేవలం ఎనిమిదిన్నర గంటల్లో విశాఖ చేరుకుంటుంది.
వందే భారత్ రైలు ప్రత్యేకతలు
వందే భారత్ రైలు సెమీ హై స్పీడ్ రకానికి చెందింది.. విమానం లాంటి ప్రయాణ అనుభూతి ఇస్తుంది వందే భారత్ రైలులో 16 కోచ్ లు ఉంటాయి. కేవలం 140 సెకండ్ల సమయంలో 160 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.. అంత వేగంలోనూ ఎటువంటి కుదుపులు లేకుండా ప్రయాణం సాగడం ఈ రైలు మరో ప్రత్యేకత.. ఎయిర్ కండిషన్ కోసం ప్రతి కోచ్ కు కోచ్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టం ఉంటుంది.. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు స్టేషన్లు, ఇతర సమాచారం అందించేందుకు ఏర్పాట్లు ఉంటాయి.. ఆటోమెటిగ్గా తెరుచుకునే, మూసుకునే డోర్లు ఉంటాయి.. ఎగ్జిక్యూటివ్ కోచ్ లలో సీట్లు 360 డిగ్రీల్లో తిరుగుతాయి. పెద్ద గాజు అద్దాల నుంచి ప్రకృతి అందాలను చూస్తూ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.. విమానాల తరహాలో బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, అంధుల కోసం బ్రెయిలీ లిపిలో సమాచారం, వరదల నుంచి రక్షణకు ప్రత్యేక ఏర్పాటు కూడా ఈ రైలులో ఉంటుంది.
* అల్ట్రా మోడల్ కోచ్ లు.
* ఎగ్జిక్యూటివ్ క్లాస్.
* పూర్తి స్థాయి సిట్టింగ్ తో పాటు ఏసీ సదుపాయం.
* పూర్తిగా దేశీయంగా తయారు.
* చాలా ఫాస్ట్ మూవింగ్.
* సికింద్రాబాద్-విశాఖ మధ్య దూరం బాగా తగ్గిపోతుంది.
* కేవలం 8.40 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి వైజాగ్ చేరుకోవచ్చు.