హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి సోయగాలతో కూడిన ఎత్తైన కొండలలపై ఉన్న ఆథ్యాత్మిక కేంద్రాల్లో పర్యాటకుల సౌలభ్యం కోసం కేబుల్ కార్ల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ముఖ్యంగా మహబూబ్నగర్లోని మన్యంకొండలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర దేవాలయం, హైదరాబాద్లోని చారిత్రాత్మక భోంగీర్ కోట, దుర్గం చెరువు వద్ద కేబుల్కార్ సేవలను ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మాడ్రిడ్లోని వరల్డ్ ట్రావెల్ మార్ట్ కోసం స్పెయిన్లో అధికారిక పర్యటనకు వచ్చిన మంత్రి మంగళవారం అక్కడి కేబుల్ కార్ సర్వీస్ను పరిశీలించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయని, తెలంగాణలోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలలో కేబుల్ కార్ సేవలను ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం వచ్చే ఏడాది నాటికి తెలంగాణలో కేబుల్కార్ సేవలను ప్రారంభించేందుకు కృషి చేస్తామని శ్రీనివాస్గౌడ్ ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, చారిత్రక, వారసత్వ, ఆధ్యాత్మిక ప్రదేశాలతో నిండి ఉంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ఇతర రాష్ట్రాల్లోనూ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా వరల్డ్ ట్రావెల్మార్ట్ వంటి అంతర్జాతీయ స్థాయి సమావేశాల్లో ప్రచారం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత, రాష్ట్రంలోని పర్యాటక రంగం నెమ్మదిగా వేగం పుంజుకుంటోందని, పర్యాటక అవకాశాలను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోందని ఆయన తెలిపారు.