హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. డిప్యూటీ మేయర్ జగదీశ్వర్ రెడ్డి కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుల పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ఈ దాడిలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ మేయర్ జగదీశ్వర్ రెడ్డితో పాటు ఏడుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్ అయ్యారు.
అరెస్ట్ అయిన వారిలో మరో ఆరుగురు బిల్డర్స్ కూడా ఉన్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి పీర్జాధిగుడా కార్పొరేషన్ లోని సాయి ప్రియ సర్కిల్ వద్ద జగదీశ్వర్ రెడ్డి కార్యాలయంలో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో పీర్జాధిగుడా డిప్యూటీ మేయర్, కోఆప్షన్ నంబర్, మరికొంత మంది కార్పొరేటర్లు అరెస్టు అయ్యారు.
కొంతకాలంగా ఈ స్థావరంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్ నేతల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులు తెలిపారు. లక్షల్లో డబ్బులు పెట్టి పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు అంటున్నారు.
ఏకంగా 13 మంది బీఆర్ఎస్ నేతలు పేకాట ఆడుతూ పట్టుబడటం స్ధానికంగా కలకలం రేగింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. పేకాట ఆడితే ఎంతటివారిపైనైనా చర్యలు తీసుకుంటామని, అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.