న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు (కేకే) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ హయాంలో క్రోనీ క్యాపిటలిజమ్ నడుస్తోందని, దేశంలో అదానీ యాక్ట్ తీసుకురమ్మని ప్రధానికి సూచన చేస్తే బాగుంటుంది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సలహా ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నిన్న పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో పాటు బీఆర్ఎస్ (BRS) బహిష్కరించింది.
రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని తాము విన్నామని, అందులో దేశంలోని ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావనే లేదని విమర్శించారు. ప్రజల సొమ్మును బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టేవిధంగా పాలన నడుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం మెచ్చిన బిజినెస్ మాగ్నెట్ గౌతమ్ అదానీ పేరుతో అదానీ చట్టం తీసుకొస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేశవరావు మండిపడ్డారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు, దేశానికి కేంద్రం చేసిందేమీ లేదని ఆయన ఎత్తిచూపారు. “మేము ఆందోళన కలిగించే సమస్యలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాము, తద్వారా చర్చ సరైన మార్గంలో సాగుతుంది” అని ఆయన అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపట్ల తమకు గౌరవమే తప్ప, ఎలాంటి వ్యతిరేకత లేదని కేశవరావు చెప్పారు. కేవలం నరేంద్రమోదీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపడానికే తాము ఇవాళ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఎన్డిఎ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజాస్వామిక నిరసన ద్వారా మాత్రమే మేము హైలైట్ చేయాలనుకుంటున్నాము, ”అని కేకే అన్నారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని కేరణ, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు, వ్యవసాయ సమస్యలను బీఆర్ఎస్ ప్రత్యేకంగా లేవనెత్తినప్పటికీ రాష్ట్రపతి ప్రసంగంలో వాటి ప్రస్తావన లేదని లోక్సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంటలకు కనీస మద్దతు ధర గురించి కేంద్రం ప్రస్తావించలేదని, వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకోలేదన్నారు.
‘‘రాష్ట్రపతి ప్రసంగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు మూడు, నాలుగు సార్లు ప్రస్తావించారు. కానీ కొత్త పార్లమెంట్ భవనానికి ఆయన పేరు పెట్టాలన్న మా డిమాండ్ ఆమోదించలేదు. తెలంగాణ రాష్ట్ర పథకాలను బీజేపీ కాపీ కొట్టి కేంద్ర పథకాలు తీసుకొస్తోందని, కానీ రాష్ట్రంలో అభివృద్ధికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.