ఆదిలాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. గతంలో హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి పట్టణాలకు పరిమితమైన ఐటీ పరిశ్రమలు.. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో సర్కారు ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్ పట్టణంలో బీడీఎన్టీ ల్యాబ్ ఐటీ కంపెనీ ఉండగా.. ఇందులో 120 మంది యువత పనిచేస్తున్నారు. . గతేడాది సెప్టెంబర్ 26న జిల్లా పర్యటనకు వచ్చిన ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ అమాత్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఐటీ టవర్ నిర్మాణానికి హామీ ఇచ్చారు.
ఈమేరకు జిల్లా యంత్రాంగం మావల మండలంలోని బట్టిసావర్గాంలో మూడెకరాల స్థలం కూడా కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ICT, రూరల్ టెక్నాలజీ పాలసీ కింద ఐటీ టవర్ నిర్మించేందుకు రూ.40 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఐటీ శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. టీఎస్ఐఐసీ అధికారులు స్థలాన్ని పరిశీలించి అనువుగా ఉందని నిర్ధారించారు. టవర్ నమూనా చిత్రాలను కూడా విడుదల చేశారు.
ఆదిలాబాద్ ఐటీ హబ్ను 48వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించనుండగా.. 800 మంది ఇంజినీర్లు, 200 మంది ఇతరులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఫలితంగా నిరుద్యోగ యువతకు ఐదంకెల జీతంతోపాటు స్థానికంగా, విదేశీయులతో కలిసి పనిచేసే అవకాశం లభించనుంది. దీంతో ఇతర రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాకు ప్రభుత్వం ఐటీ టవర్ మంజూరు, నిధులు కేటాయించడం పట్ల జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ టవర్ నిర్మాణంలో భాగంగా త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభవుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు.