హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ (డబ్ల్యుటిఇ) ప్లాంట్ను 2021లో జవహర్నగర్లో ప్రారంభించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం సమీప భవిష్యత్తులో కూడా ఘన వ్యర్థాల నుండి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలవడంపై దృష్టి పెట్టింది.
2021లో, జవహర్నగర్లో 19.8 మెగావాట్ల ప్లాంట్ ప్రారంభించారు. ఆ తరువాత దానిని 24 మెగావాట్ల ప్లాంట్గా అప్గ్రేడ్ చేశారు. ఇది రోజుకు 1300 నుండి 1500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వినియోగిస్తుంది. ఈ ఏడాది జనవరి నాటికి ప్లాంట్ 6.35 లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగించి 225 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. ఈ ప్లాంట్ ఇప్పుడు దాని పూర్తి సామర్థ్యం 48 మెగావాట్లకు పెంచారు. రోజుకు 2,500 మెట్రిక్ టన్నుల నుండి 3,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వినియోగిస్తోంది.
దీనికి తోడు దుండిగల్లో 1000 నుంచి 1200 మెట్రిక్ టన్నుల వ్యర్థ వినియోగ సామర్థ్యంతో మరో 14.5 మెగావాట్ల ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్ ఆ ప్రాంతంలో దుర్వాసనను తగ్గించి, నేల, నీటి కాలుష్యాన్ని నిరోధిస్తుంది. ఇది మరో 18 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో 150 ఎకరాల ప్రభుత్వ భూమిలో 15 మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్లాంట్, బీబీ నగర్లో 11 మెగావాట్లు, యాచారంలో 14 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్యారానగర్లో ప్రతిపాదిత ప్లాంట్ లో 800 మెట్రిక్ టన్నుల నుండి 1000 మెట్రిక్ టన్నుల వరకు వ్యర్థాలను వినియోగిస్తారు.
పైన పేర్కొన్న అన్ని ప్లాంట్లు పనిచేస్తే, తెలంగాణ 100 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సీనియర్ మున్సిపాల్ పట్టణాభివృద్ధి అధికారి తెలిపారు.
జిల్లాల్లో సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ సాధన కోసం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది క్లస్టర్లలో బయో మైనింగ్ను చేపడుతోంది. వీటిలో వరంగల్, కరీంనగర్ రెండు క్లస్టర్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ప్రతిపాదించారు. క్లస్టర్ల నుండి ఉత్పత్తయ్యే రిఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ (RDF) విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ప్రతిపాదిత ఇంధన ప్లాంట్లలో ఉపయోగించనున్నారు.