హైదరాబాద్: హైదరాబాద్లో డీజిల్ బస్సులకు గుడ్బై చెప్పే సమయం వచ్చింది. టీఎస్ఆర్టీసీ దాదాపు 550 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ నుంచి కొనబోతోంది. ఆ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కు చెందింది. ఒలెక్ట్రాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం తొలుత 50 ఎలక్ట్రిక్ బస్సులు కొంటారు. ఈ ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి ఛార్జీ చేస్తే 325 కిమీ. ప్రయాణిస్తుంది. ఇవే కాకుండా సింగిల్ ఛార్జీతో 225 కిమీ. కవర్ చేసే మరో 500 బస్సులను కూడా కొంటున్నారు.
పర్యావరణ కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గించడంతో పాటు ఖర్చుల నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచేందుకు ఆర్టీసి చర్యలు తీసుకుంటోంది. ఈ బస్సులు ఎయిర్ కండిషన్డ్, సౌండ్ లేనివి. నగరంలోని వేర్వేరు డిపోలకు వీటిని కేటాయించనున్నారు. హెచ్ఎండిఏ పరిధిలోని ఐదు డిపోల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది.పర్యావరణ పరిరక్షణకు, ఆర్టీసి ఖర్చులు తగ్గించేందుకు ఈ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో మొత్తం 3400 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
2025 నాటికి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బస్సు సర్వీసులు పూర్తిగా ఎయిర్ కండిషన్, ఎలక్ట్రానిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. తమ కంపెనీకి వచ్చిన ఆర్డర్ను దశలవారీగా అందజేయాలని కంపెనీ నిర్ణయించినట్లు ఒలెక్ట్రా సిఎండీ కె.వి. ప్రదీప్ తెలిపారు.
కిలో మీటర్కు రూ.13 మిగులు..
డిజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకురావడం వల్ల ఆర్టీసీపై పడే ఆర్థిక భారం బాగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. పైగా విద్యుత్ బస్సుల వల్ల కిలో మీటర్కు రూ.13 మిగులుతుందని చెబుతున్నారు. కిలోమీటర్కు విద్యుత్ బిల్లులు రూ.7 ఖర్చు వస్తుందని, అదే డీజిల్ ఖర్చు మాత్రం రూ.20 గా ఉంటుంని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రూ.13 ఆదా అవుతుందన్నారు. అయితే డీజిల్ బస్సులతో పోల్చితే.. విద్యుత్ బస్సు ఖరీదు అధికంగా ఉన్నప్పటికీ.. నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతున్నాయని అంచనా వేసిన తర్వాతే విద్యుత్ బస్సుల వైపు ఆర్టీసీ అధికారులు మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది.