హైదరాబాద్: విమానయాన రంగంలో సత్తా చాటుతున్న హైదరాబాద్లో ఏరోస్పేస్, డిఫెన్స్ ‘ఎకోసిస్టమ్’ మరింత బలోపేతం కానుంది. ఈమేరకు అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్.. జీఎమ్మార్ ఏరో టెక్నిక్స్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో ప్రయాణికుల విమానాలను సరుకు రవాణా విమానాలుగా మార్చే కార్యకలాపాలను ప్రారంభించనున్నది. ఇందులో భాగంగా 737 బోయింగ్ ప్యాసింజర్ విమానాలను కార్గో విమానాలుగా మార్పిడి చేయనున్నారు. దీనికోసం కన్వర్షన్ లైన్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో బోయింగ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకోనుంది.
భారత్లోని ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్) ఈ తరహా కార్యకలాపాలు చేపట్టడం ఇదే ప్రథమం. ఇందుకు హైదరాబాద్ వేదిక అవుతుండగా.. సీఎం కేసీఆర్ కృషికి, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలకు ఇది మరో నిదర్శనం. విమాన కంపెనీలు సహజంగా ప్యాసింజర్ విమానాలనే ఎక్కువగా తయారు చేస్తాయి. ఇవి ఎంతకాలం ఉపయోగపడతాయనేది వాటి నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ప్యాసింజర్ విమానం కనీసం 50వేల గంటలు ప్రయాణిస్తుంది. ఇటీవల తయారవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంగల విమానాలు ఇంతకన్నా ఎక్కువ ఉపయోగపడుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. విమాన విడిభాగాలు ఖరీదైనవి కాబట్టి కాలపరిమితి పూర్తయిన విమానాల విడిభాగాలను ఇతర విమానాలకూ ఉపయోగిస్తారు.
హైదరాబాద్లో ఈ తరహా కార్యకలాపాలు చేపట్టడం భారత్లోని ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్) సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని చెప్పవచ్చు. మొదటి విమాన మార్పిడి సమయం ఇండిగో, స్పైస్జెట్, బ్లూడార్ట్, క్విక్జెట్ తదితర కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్పై ఆధారపడి ఉంటుందని బోయింగ్ వర్గాలు వెల్లడించాయి. రాబోయే 18 నెలల్లో శిక్షణ, టెక్నాలజీ బదిలీతో సహా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి బోయింగ్ కంపెనీ GMRతో కలిసి పని చేస్తుంది.
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన ‘ఎకోసిస్టమ్’ను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వ చురుకైన విధానాలతో ప్రముఖ విమానయాన సంస్థ ‘బోయింగ్’ను ఆకట్టుకుంది. హైదరాబాద్లో ప్రధాన ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు బోయింగ్ను ఒప్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రగతిశీల నాయకత్వం పాత్ర ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి.