హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ కారిడార్లో పనిచేసే మహిళల కోసం ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలో మరిన్ని మార్గాల్లో లేడీస్ స్పెషల్ బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధంగా ఉందని ఎండీ వి.సి.సజ్జన్నార్ తెలిపారు.
మెట్రో ఎక్స్ ప్రెస్ లేడీస్ స్పెషల్’ బస్సును నేడు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ బస్సు జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ వరకు వెళ్తుంది. జేఎన్టీయూ నుంచి ఉదయం 9.05 గంటలకు బయలుదేరుతుంది. నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి క్రాస్ రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ క్రాస్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వేవ్ రాక్ వరకు వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5.50 గంటలకు వేవ్ రాక్ నుంచి బయలుదేరి ఆయా మార్గాల ద్వారా జేఎన్టీయూకు చేరుకుంటుంది.
ఐటీ కారిడార్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న మహిళలు ఈ ప్రత్యేక బస్సునలు వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
https://twitter.com/tsrtcmdoffice/status/1684919997087485952?s=20
మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ సంస్థ తెలిపింది. అయితే టీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళ ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో క్యాబ్స్, ఓలా , ర్యాపిడో వెహికల్స్ పై ఆధార పడాల్సిన అవసరం లేదంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి, ఎండీ సజ్జనార్ గారికి ఐటీ కారిడార్ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.