హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం లేకుండానే 2022–23 బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 7న ఉదయం 11.30కు శాసనసభ, మండలి వేర్వేరుగా ప్రారంభమవుతాయని పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్లో సమావేశమై రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. ఇక బడ్జెట్ సమావేశాలను ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనే దానిపై.. 7న స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు. సమావేశాల తొలిరోజునే శాసనసభ, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నెల 24 వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
అసెంబ్లీ గత సమావేశాలు గత ఏడాది అక్టోబర్ 8న వాయిదా పడ్డాయి. సమావేశం ప్రొరోగ్ కాలేదు. ప్రొరోగ్ చేయని కారణంగా.. గతంలో వాయిదా పడిన సభను ఎప్పుడైనా సమావేశపర్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు.. గత సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు ఉండబోతున్నాయి. కనుక గవర్నర్ ప్రసంగం అవసరం లేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.