విశాఖపట్నం: ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ ఉంటే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘భవిత’ పేరుతో ప్రారంభించిన స్కిల్ కాస్కిడింగ్ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమం యువత భవిష్యత్తుకు దిక్సూచిగా మారుటెందని అభిప్రాయపడ్డారు. ఏపీలో నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ దొరుకుతోందని… ఇక్కడ విద్యార్థుల్ని సానబెడితే అన్ని రంగాల్లోనూ రాణించగల సత్తా ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
ఇక మంగళవారం విశాఖపట్నంలో సీఎం జగన్ చేసిన ప్రసంగం గత సమావేశాల్లో చేసిన ప్రసంగాలకు భిన్నంగా కనిపించింది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. ఆయన ప్రకటన సంచలనం సృష్టించడంతో పాటు రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచింది.
రాజకీయ వ్యూహకర్త వ్యాఖ్యలకు విశాఖ సభలో సీఎం జగన్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తాను మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. ఏపీని వివిధ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పదేళ్ల ప్రణాళికను ప్రకటించారు.
కాగా విశాఖ నగరంలోని రెండు వేర్వేరు వేదికల్లో జరిగిన ‘విజన్ విశాఖ’ డెవలప్మెంట్ డైలాగ్ ప్రోగ్రామ్, ‘భవిత’ – ఫ్యూచర్స్ షేపింగ్ ఫ్యూచర్స్ ‘ది క్యాస్కేడింగ్ స్కిల్స్ ప్యారడిగ్మ్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించే విధానాన్ని మార్చుకున్నారు. ఆయన ప్రసంగంలో ప్రజలు తనకు మళ్లీ ఓటు వేస్తారని 2024 ఎన్నికల తర్వాత వైజాగ్లో తన ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేసారు.
వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో యువతను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యాసంస్థలకు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎకో సిస్టంను అభివృద్ధి చేయడంతో పాటు పరిశ్రమ – విద్యాసంస్థల మధ్య అంతరాన్ని పూరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘భవిత’ ప్రోగ్రాం ద్వారా… యువతకు ఉపాధి నైపుణ్యాలు పెరుగుతాయని, తద్వారా ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి ఇది ఒక గేమ్ ఛేంజర్గా ఉంటుందని స్పష్టం చేశారు.
నాణ్యమైన విద్య లేకపోతే చదువు వృథా అవుతుందని, పాఠ్యాంశాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు. వచ్చే పదేళ్లలో విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని, రానున్న కాలంలో ప్రభుత్వం ఊహించని స్థాయిలో వివిధ రంగాలను అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు.
ఇంకా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగేలా విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో శిక్షణ పొందిన 53,000 మందిలో 26,000 మందికి మంచి ఉద్యోగాలు లభించాయి.
2019కి ముందు రాష్ట్రంలో ఒకే ఒక్క పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు ఉండేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 32 కాలేజీలకు నేషనల్ బోర్డ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు లభించిందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయనడానికి ఇది నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ హబ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతోపాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు.