టొరంటో: కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం, గత ఏడాది బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో సంబంధమున్న ముగ్గురు భారతీయ అనుమానితులను శుక్రవారం కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. కరణ్ బ్రార్(22), కమల్ ప్రీత్ సింగ్(22), కరణ్ ప్రీత్ సింగ్(28)లను అరెస్ట్ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ మన్దీప్ మూకర్ తెలిపారు.
కొన్ని నెలలుగా వారి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు శుక్రవారం నిందితులను అరెస్టు చేశారు. రెండు ప్రావిన్సుల్లో ఒకేసారి దాడులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కెనడా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ ఓ వార్తను ప్రస్తారం చేసింది.
గతేడాది జూన్ 18న సర్రీలోని ఓ గురుద్వారాలో ప్రార్ధన ముగించుకుని బయటకు వచ్చిన నిజ్జర్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది.
తాజాగా టొరొంటోలో జరిగిన ఖల్సా డే కార్యక్రమంలోనూ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నిజ్జర్ హత్య గురించి ప్రస్తావించారు. ఈ హత్య కెనడా అంతర్గత భద్రతకు ఓ సవాలని పేర్కొన్నారు. ఈ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని పునరుద్ఝాటించారు.
కెనడా ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ‘‘ప్రధాని ట్రూడో గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కెనడాలో వేర్పాటువాదానికి, హింసకు, తీవ్రవాదానికి రాజకీయ ప్రాముఖ్యత ఉన్న విషయాన్ని ఆయన వ్యాఖ్యలు ఎత్తి చూపుతున్నాయి’’ అని మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్దీప్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, భారత్లోని కెనడా డిప్యూటీ హైకమిషనర్కు పిలిపించుకుని కేంద్ర ప్రభుత్వం తన నిరసన వ్యక్తం చేశారు. ట్రూడో హాజరైన కార్యక్రమంలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.