ముంబయి: లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని మోడీపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ మళ్లీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తారని పవార్ అన్నారు.
చిక్కోడి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక జార్కిహోళికి అనుకూలంగా లోక్సభ ఎన్నికల ర్యాలీలో పవార్ ప్రసంగిస్తూ, “స్వాతంత్య్రం తర్వాత నెహ్రూ, ఇందిరా, రాజీవ్లు ప్రజాస్వామ్య జ్వాలలను సజీవంగా ఉంచారు. కానీ నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం నియంతృత్వం వైపు వెళుతోందని అన్నారు.
2014లో మోదీ ప్రభుత్వం ఉన్నతమైన ఆశయాలతో అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికల హామీల్లో సగం కూడా నెరవేర్చలేదు. 2014లో లీటర్ పెట్రోల్ రూ.71కి అమ్మితే ఇప్పుడు రూ.100 దాటింది. LPG సిలిండర్ ధర గత 10 సంవత్సరాలలో మూడు రెట్లు పెరిగింది.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆత్మహత్యల బాట పట్టారు. ప్రధాని సామాన్యుల జీవితాన్ని దుర్భరం చేశారు’’ అని పవార్ ఆరోపించారు.
పవార్ ఇంకా మాట్లాడుతూ… “మోడీ ప్రభుత్వం విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికి ప్రభుత్వ సంస్థలను ఉపయోగిస్తోంది. భిన్నాభిప్రాయాలను అరికట్టేందుకు మోదీ పాలన ప్రతిపక్ష హోదాలో ఉన్న నేతలను జైలుకు పంపుతోంది’’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్లను ఉదహరించారు.
కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను ప్రశంసిస్తూ, “కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, పొరుగున ఉన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను సమర్థవంతంగా అమలు చేశాయి. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన పథకాలు యావత్ దేశానికే ఆదర్శం. కాబట్టి, I.N.D.I.A కూటమి అవసరం ఈ దేశానికి ఉంది. కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని పవార్ ఆశాభావం వెలిబుచ్చారు.