కోల్కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. రాజ్భవన్లో పనిచేస్తున్న ఓ మహిళ గవర్నర్పై లైంగిక వేధింపులకు పాల్పడట్టు పిర్యాదు చేసింది. అయితే ఇలాంటి కల్పిత ాఆరోపణలకు తాను భయపడనని, సత్యమే గెలుస్తుందని గవర్నర్ అన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బెంగాల్ పర్యటనకు వస్తోన్న వేళ ఈ ఆరోపణలు రావడం గమనార్హం.
పశ్చిమ బెంగాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల్లో 36 స్థానాలకు మే 7 నుంచి జూన్ 1 మధ్య ఐదు దశల్లో ఎన్నికలు జరగనుండగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ వెంటనే ఆ ఆరోపణలను రాజకీయంగా లబ్ధి పొందేందుకు పావులు కదుపుతోంది.
మహిళల గౌరవమర్యాదలపై మోదీ, షాలకు నిజంగా నమ్మకం ఉంటే వెంటనే బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
ఈ ఆరోపణలపై గవర్నర్ ఆనంద బోస్ స్పందిస్తూ… అంతా కల్పితమేనని కొట్టిపారేశారు. ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వారికి దేవుడు ఆశీసులండాలని, బెంగాల్లో హింస, అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం ఆగదని బోస్ స్పష్టం చేశారు.
కాగా, పశ్చిమ బెంగాల్లోని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై బోస్ తరచుగా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆదేశాల మేరకు ఆయన వ్యవహరిస్తున్నారని టీఎంసీ ఆరోపించింది.
కేసు వివరాల్లోకి వెళితే… 2019 జూన్ నుంచి తాను రాజ్భవన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నానని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. అయితే తాజాగా ఆమెకు రాజ్భవన్లో స్పెషల్ డ్యూటీ ఇచ్చారు. ఏప్రిల్ 24న గవర్నర్ ఆమెను తన కార్యాలయానికి పిలిచి అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. గురువారం మరోసారి ఆమెను గవర్నర్ కార్యాలయానికి పిలిపించారు. ఆమె ఈసారి తనతో పాటు సూపర్వైజర్ని తీసుకువచ్చింది. గవర్నర్ మాత్రం సూపర్వైజర్ను వెళ్లిపోవాల్సిందిగా కోరగా, ఆమె ఆరోపణ మేరకు మళ్లీ ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు.
ఆమెకు రాజ్భవన్లో తాత్కాలికంగా ఉన్న ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తామని ఆఫర్ వచ్చింది. అయితే, ఆమె అసౌకర్యంగా భావించి, రాజ్భవన్లోని పోలీసు అవుట్పోస్ట్కు వెళ్లి, తన కష్టాలను పోలీసులకు చెప్పింది. హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. మేము ఆమె ఫిర్యాదును నమోదు చేసి విచారణ ప్రారంభించాము” అని కోల్కతా పోలీస్ డిప్యూటీ కమిషనర్ (సెంట్రల్) ఇందిరా ముఖర్జీ విలేకరులతో అన్నారు.
మరోవంక బెంగాల్లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఆపలేరని రాజ్ భవన్ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో గవర్నర్ ఆనంద్ బోస్ పేర్కొన్నారు.
అనంతరం రాజ్భవన్లోకి పోలీసుల ప్రవేశాన్ని గవర్నర్ నిషేధించారు
మహిళ నమోదు చేసిన ఫిర్యాదుపై కోల్కతా పోలీసులు న్యాయపరమైన అభిప్రాయాలు తీసుకుంటారని కోల్కతా పోలీస్ డిప్యూటీ కమిషనర్ ముఖర్జీ విలేకరులతో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్కు తెలియజేయవచ్చని వార్తలొస్తున్నాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం… తన పదవీ కాలంలో ఏ రాష్ట్ర గవర్నర్పైనా కోర్టులో క్రిమినల్ విచారణను అనుమతించనప్పటికీ, ఆనంద బోస్పై మహిళ చేసిన ఆరోపణ పశ్చిమ బెంగాల్లో రాజకీయ తుఫానును రేకెత్తించింది.