న్యూఢిల్లీ: రాజకీయపార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డుల పంపిణీ నేపథ్యంలో ఎన్నికల తర్వాత సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చుతామంటూ ఆశ చూపి, ఓటర్ల పేర్లను ప్రైవేటుగా నమోదు చేసుకోవడాన్ని వెంటనే నిలిపివేయాలంటూ రాజకీయ పార్టీలను ఈసీ ఆదేశించింది.
ఎన్నికల తర్వాత ప్రయోజనాల వాగ్దానాన్ని ప్రోత్సహిస్తే ఓటర్లు, వాగ్దానం చేసినవారి మధ్య ఇచ్చిపుచ్చుకునే అవగాహన ఏర్పడుతుందని, ఇది ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీస్తుందని ఎన్నికల సంఘం రాజకీయపార్టీలకు రాసిన లేఖలో వ్యాఖ్యానించింది.
సర్వేలు లేదా యాప్ ద్వారా వ్యక్తుల నమోదుకు సంబంధించిన కార్యకలాపాలను ఆపివేయాలని దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఈసీ కోరింది. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డుల పంపిణీపై గతంలో బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
EC ఆదేశాలను ఉల్లంఘించిన వారు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 123(1), లంచానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 171(B) ప్రకారం చర్యను ఎదుర్కొంటారు.
అయితే, గ్యారెంటీ కార్డుల పంపిణీని కొనసాగిస్తామని, అయితే కౌంటర్ఫాయిల్ వివరాలను కోరబోమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల అనంతర ప్రయోజనాల కల్పిస్తామన్న హామీ.. ఓటర్లు, వాగ్దానం చేసే వ్యక్తుల మధ్య రాజీకి కుదరవచ్చని పేర్కొంది. ఇది ‘క్విడ్ ప్రో కో’కు దారితీస్తుందని పార్టీలకు రాసిన లేఖలో ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది.
సాధారణ ఎన్నికల వాగ్దానాలకు అనుమతి ఉన్నప్పటికీ.. పథకాల ఆశచూపి ఇప్పుడే ఓటర్ల పేర్లు నమోదు చేసుకుంటే నిజమైన సర్వేలు, రాజకీయ లబ్ధి చేకూర్చే పక్షపాత ప్రయత్నాల మధ్య వ్యత్యాసం అస్పష్టంగా మారుతుందని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.