హైదరాబాద్: నదుల అనుసంధానంపై నగరంలోని జలసౌధలో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్ర సింగ్ మంగళవారం మాట్లాడుతూ, నదుల అనుసంధానం నదుల వ్యాపారీకరణ తప్ప మరొకటి కాదని, ఇది రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి, దేశంలో అవినీతికి దారితీస్తుందని అన్నారు. నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రాల మధ్య తగాదాలు వస్తాయన్నారు. మిగులు జలాలు ఉన్నాయని ఏ రాష్ట్రం అంగీకరించలేదు అని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నదుల అనుసంధానాన్ని చేపడితే గాంధీజీ మార్గంలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. గుండె, మెదడును నదితో అనుసంధానం చేయాలి కానీ నదులను అనుసంధానం చేయరాదన్నారు. రాజ్యాంగం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నదీ ప్రవాహాలను నిర్వహిస్తుందని, వర్షపు నీటి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని గుర్తుచేస్తూ, 73, 74 రాజ్యాంగ సవరణలు నీటిపై పంచాయతీలకు కొన్ని హక్కులను కూడా ఇచ్చాయని అన్నారు.
“నదుల అనుసంధానం జరిగితే దేశంలో పర్యావరణ, ఆర్థిక, సాంస్కృతిక సంక్షోభాలు తలెత్తుతాయని ఆయన సూచించారు. రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తుంది,” అన్నారాయన. నదుల అనుసంధాన ప్రాజెక్టుల సవివరమైన ప్రాజెక్టు నివేదికలు గతంలో నదుల ప్రవాహాల ప్రకారమే రూపొందించామని ఆయన సూచించారు. తరువాత, వివిధ నదులలో ప్రవాహాలు తగ్గినందున ఇప్పుడు ఆ DPRలు అప్రస్తుతం అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు సూచనలతో 1992లో 25 వేల మైనింగ్ కంపెనీలు మూసివేశారు. తరువాత భూగర్భ జలాలు ఉబికి వచ్చి నీటి సమస్య పరిష్కారం అయిందని రాజేందర్ సింగ్ గుర్తు చేశారు.
“నదుల అనుసంధానం అభివృద్ధి కంటే వినాశనానికి దారి తీస్తుంది. ఇది నీటి వ్యాపారీకరణ తప్ప మరొకటి కాదు”అని సింగ్ అన్నారు. నదుల అనుసంధానాన్ని కేంద్రీకృత నీటి నిర్వహణగా అభివర్ణిస్తూ, “మాకు కమ్యూనిటీ ద్వారా నడిచే వికేంద్రీకృత నీటి నిర్వహణ అవసరం.” అని ఆయన సూచించారు. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న నదులపై జాతీయ సదస్సులో ‘డ్రాఫ్ట్ రివర్ మ్యానిఫెస్టో’ను ఖరారు చేయనున్నట్లు రాజేంద్ర సింగ్ తెలిపారు.
@ నీటి వర్సిటీ!
నీటి నిల్వ కోసం భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించిన రాజేంద్ర సింగ్, రాష్ట్రంలో వాటర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు సూచించారు. “మాకు వ్యవసాయం, ఉద్యానవన, ఆరోగ్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. నీరు ప్రాణం. కానీ నీటి కోసం విశ్వవిద్యాలయం లేదు. దేశంలోనే తొలి వాటర్ యూనివర్సిటీని తెలంగాణలో నెలకొల్పాలని కేసీఆర్కు సూచిస్తున్నాను’’ అని అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం నీటి నిర్వహణలో ‘జీరో’ నుంచి ప్రారంభమైన తెలంగాణ… నేడు ‘హీరో’గా నిలిచిందన్నారు.
నీటి పారుదల విషయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ సీఎం కేసీఆర్ను చూసి నేర్చుకోవాలి అని రాజేందర్ సింగ్ సూచించారు. సాగునీటి రంగంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు అన్ని రాష్ట్రాలు అనుసరించాలన్నారు. వ్యవసాయానికి, ఇతర రంగాలకు క్రమం తప్పకుండా నీటిని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని రాజేందర్ సింగ్ పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో పైపుల ద్వారా మంచినీటి సరఫరా చేయడం హర్షణీయం. తెలంగాణలో ఎక్కడా ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు అందించే పరిస్థితి లేదు అని ఆయన స్పష్టం చేశారు.
తాను పెద్ద ప్రాజెక్టులకు వ్యతిరేకి అయినప్పటికీ 200 కిలోమీటర్ల మేర గోదావరి నదిని పునరుజ్జీవింపజేసేలా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. వరి సాగు విస్తీర్ణం తగ్గించి మినుములు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తూ పంటల సరళిని మార్చినందుకు సీఎంను అభినందించారు.