హైదరాబాద్: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదరుచూస్తోన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం నవంబర్ మూడో తేదీ నుంచి నామినేషన్ల ఘట్టం మొదలవనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. షెడ్యూల్ రావడంతో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా అమల్లోకి వచ్చింది.
ఎన్నికల షెడ్యూల్ ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ తేదీ – నవంబర్ 03
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – నవంబర్ 10
- నామినేషన్ల పరిశీలన – నవంబర్ 13
- నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ – నవంబర్ 15
- పోలింగ్ – నవంబర్ 30
- ఓట్ల లెక్కింపు – డిసెంబర్ 03
తెలంగాణలో 3.17,17,389 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ వెల్లడించింది. కొత్తగా 17,01,087 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపింది. 18-19 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 3,35,043 లక్షలుగా పేర్కొంది 5.06 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు, 4.44 లక్షలు మంది 80 ఏళ్లు పై బడిన వారు ఉన్నారని పేర్కొంది. 100 ఏళ్లు పై బడినవారు 7,005 మంది ఉన్నారని చెప్పింది. రాష్ట్రంలో ప్రతి 897 మందికి ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈసారి వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.
రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈసీ వెల్లడించింది. తెలంగాణ సరహద్దుల్లోని 148 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు – రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం – అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, మధ్యప్రదేశ్లో బీజేపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలు, ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇచ్చే అవకాశం ఉండదు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 19, ఏఐఎంఐఎం ఏడు, టీడీపీ రెండు, బీజేపీ ఒకటి, ఏఐఎఫ్బీ ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు ఒక స్థానంలో గెలుపొందారు. మొత్తం పోలైన 2,06,95,428 ఓట్లలో టీఆర్ఎస్కు 97,00,948 ఓట్లు రాగా, కాంగ్రెస్కు 58,83,088 ఓట్లు రాగా, బీజేపీకి 14,43,799 ఓట్లు వచ్చాయి. AIMIMకి 5,61,091 వచ్చాయి.