హైదరాబాద్: తెలంగాణలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన కొద్ది గంటల తర్వాత నగర పోలీసులు వాహనాల తనిఖీల్లో ఏడు కిలోల బంగారం, మూడు వందల కిలోల వెండి, దాదాపు రూ.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే పోలీసులు నిఘా పెట్టారు. బషీర్ బాగ్ సమీపంలోని నిజాం కళాశాల గేట్ నంబర్ 1 ముందు పోలీసుల బృందం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న పది కోట్ల విలువైన7 కిలోల బంగారం, 295 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. షేక్ పేట్ వద్ద కారులో తరలిస్తున్న 30 లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పోలీసులు బంగారం, వెండిని స్వాధీనం చేసుకుని నిందితులను అబిడ్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా హబీబ్ నగర్ పోలీసులు అగాపురాలోని హమీద్ కేఫ్ జంక్షన్ వద్ద రూ. 17 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో బేగంబజార్లో నివాసముంటున్న దినేష్ ప్రజాపతి వద్ద అనుమానాస్పదంగా తరలిస్తున్న ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, షేక్పేటలోని నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో వాహనాల తనిఖీలో ఫిల్మ్ నగర్ పోలీసులు రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఛాదర్ఘాట్ క్రాస్రోడ్లో 9లక్షలు తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పురానాపూల్ గాంధీ విగ్రహం సమీపంలో యాక్టీవాలో తరలిస్తున్న 15లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ ఠాణా పరిధిలో ఐదున్నర కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్టమైన నిఘా ఉంచినందుకు పోలీసు అధికారులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు.