న్యూఢిల్లీ: దేశంలో వనరులను పునర్విభజన చేస్తామని, వాటిని ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, ప్రత్యేకంగా భూమి, బంగారం, మహిళల మంగళసూత్రాలను ప్రస్తావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు ఆరోపిస్తున్నారు. కాషాయ పార్టీ ఓటర్లను దృష్టి మరల్చి వర్గీకరణ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
ది వైర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు అమితాబ్ దూబే, కాంగ్రెస్ మ్యానిఫెస్టో పునర్విభజన గురించి మాట్లాడలేదని అన్నారు. “మేము అర్థం చేసుకున్న దాని గురించి మాకు చాలా స్పష్టంగా ఉంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రధానమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
“మ్యానిఫెస్టో మాట్లాడే మొదటి విషయం ఏమిటంటే దేశంలో అసమానత అనేది ఒక పెద్ద సమస్య. ఇది గ్లోబల్ సమస్య, కానీ భారతదేశంలో, ఇది ముఖ్యంగా తీవ్రంగా ఉంది.
“దేశంలోని సంపదలో 40% దేశ జనాభాలో ఒక్క శాతం ఉన్న సంపన్నుల వద్దే ఉంది. మనదేశంలో అసమానత స్థాయి బ్రిటీష్ రాజ్ కంటే ఎక్కువగా ఉంది. ఇది మోడీ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఇలా జరగిందని దూబే ఆరోపించారు.
పేద మహిళలకు సంవత్సరానికి రూ.లక్ష, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద రూ.400 వేతనం, అప్రెంటిస్షిప్ కార్యక్రమాలు, 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఖాళీల భర్తీతో సహా అసమానతలను పరిష్కరించడానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని దూబే చెప్పారు. కనీస మద్దతు ధరలకు చట్టపరమైన హామీని అందించడంతోపాటు సామాజిక-ఆర్థిక కుల గణన చేపడతామని అమితాబ్ దూబే స్పష్టం చేశారు.
“కాబట్టి మోదీ ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో పెరిగిన అసమానతలను పరిష్కరించడానికి ఇది ఒక ప్యాకేజీ. ఈ ప్రతిపాదనలన్నీ సమాజంలోని అన్ని వర్గాల కోసం ఉద్దేశించినవి. మైనారిటీలు లేదా ఎస్సీ/ఎస్టీ/ఓబీసీల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించినవి కావు, పేద ప్రజలందరికీ ఇవి ఉపయోగపడతాయని” ఆయన అన్నారు.
ప్రతిపాదనలు కూడా కుల వివక్షను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాయని, అయితే ఆస్తుల పునర్విభజన గురించి మాట్లాడడం లేదని దూబే అన్నారు.
“ఆస్తి పునర్విభజన లేదు. వనరులు ఎక్కడికి వెళ్లవు, ప్రభుత్వ భూమి అందులో భాగమే. మేము ఎవరి దగ్గరా భూములు తీసుకోవడం లేదు’’ గతంలో ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంపిణీ చేశామన్నారు.
“ఇది ఎవరి ఆస్తుల పునర్విభజన గురించి కాదు, ప్రభుత్వ డబ్బు ఎలా ఖర్చు చేయబడుతుందన్నదే ప్రధానం.
“ మోడీ విధానాలు అందరిపై దాడి చేస్తున్నాయి. అతను మతపరమైన కోణాన్ని తీసుకువస్తున్నాడు. అతను పేదలను మత ప్రాతిపదికన విభజించడానికి ప్రయత్నిస్తున్నాడు, ”అని దూబే అన్నారు, పేదలు తొందరలోనే “అర్థం చేసుకుంటారు… వారంతా వివక్షకు గురవుతున్నారని, మోదీ విధానాలు SCలు/STలు/OBCలు, ఆర్థికంగా బలహీన వర్గాలు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నాయని దూబే తన ఇంటర్వ్యూలో తెలిపారు.
‘షరియా చట్టం’ ద్వారా ప్రభుత్వాన్ని నడపాలని కాంగ్రెస్ భావిస్తోందని, గోవుల వధను అనుమతించాలని, తమ మ్యానిఫెస్టోని ముస్లిం లీగ్తో సమానం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని దూబే ఆరోపించారు.
“ఇందులో స్పష్టంగా రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, మా ఫీడ్బ్యాక్ బాగుంది. అయితే బీజేపీ గత కొన్ని నెలలుగా ఎన్ని కుయుక్తులు పన్నినా వాటిని ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమైందన్న విషయం బిజెపికి తెలిసొచ్చిందని” ఆయన అన్నారు.
“బీజేపీ ఓట్ల శాతం పడిపోతుంది. వారికి 180 కంటే తక్కువ సీట్లు వస్తాయి. ప్రతిపక్షంలో కూచోవాల్సి వస్తుంది. ఓటర్లు ముఖ్యంగా పట్టించుకునే రెండు అంశాల్లో ప్రధానంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం నుండి దృష్టి మరల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని దూబే అన్నారు.
“మరొక విషయం ఏమిటంటే, పోలింగ్ శాతం బాగా పడిపోయింది. ఈ ప్రభుత్వం ఓటమినుంచి బయటపడే మార్గంలో ఉంది. అధికారంలో కొనసాగడానికి వారు చివరి తీరని ప్రయత్నాలు చేస్తున్నారని” ది వైర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమితాబ్ దూబే స్పష్టం చేశారు.