న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అరెస్టు చేశాక తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎట్టకేలకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జాతీయ పార్టీ అధినేతగా ఉన్న తనను లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే మద్యం కేసులో అరెస్టు చేశారన్న కేజ్రివాల్ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
అయినప్పటికీ ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయవచ్చా, ఎలాంటి షరతులు విధించవచ్చనే దానిపై సూచనలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోర్టు కోరింది.
ఈడీ తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిసే సమయానికి న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం మౌఖిక పరిశీలనలు చేసింది.
ఈ నెల 7న ఈ అంశంపై విచారణ జరుపుతామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు తెలిపింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బెయిల్ అంశంపై సిద్ధంగా ఉండాలని ఈడీ న్యాయవాదికి సూచించింది. అయితే మధ్యంతర బెయిల్ పటిషన్ను తాము వ్యతిరేకిస్తామని ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అన్నారు. ‘మేం బెయిల్ మంజూరు చేయవచ్చు లేదా మంజూరు చేయకపోవచ్చు. దీని గురించి ఇరు వర్గాలు ఆశ్చర్యపోనవసరం లేదు’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే బెయిల్ అంశంపై ఇరు వర్గాల వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది.
అయితే మే 7న కోర్టు అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.