హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు.. తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. ఎనిమిదేళ్లుగా సాగుతున్న రోహిత్ వేముల కేసును క్లోజ్ చేస్తున్నట్టు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.
పోలీసుల తాజా రిపోర్టులో రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. వేముల రోహిత్ కుటుంబానికి చెందిన కుల ధృవీకరణ పత్రాలను ఫోర్జరీ చేశారని, రోహిత్ దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఎస్సీ సర్టిపికేట్ పొందిన వేముల అసలు కులం బయటపడుతుందన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ 2015లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు యూనివర్శిటీలో “కులతత్వ, అతివాద, దేశ వ్యతిరేక రాజకీయాల” గురించి లేఖ రాశారు, ఇది ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు వచ్చాయి.
హైదరాబాద్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, అప్పటి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్రావు, ఏబీవీపీ నేతలతో సహా బీజేపీ నేతలను ఈ నివేదిక తప్పుబట్టింది.
రోహిత్ వేముల తాను షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) వర్గానికి చెందినవాడిని కాదని, అతడి తల్లి ఎస్సీ సర్టిఫికేట్ పొందిందని తనకు తెలుసునని పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఇది అతడి భయాలలో ఒకటి కావచ్చు, అదే బహిర్గతం కావడం వలన అతను సంవత్సరాల తరబడి సంపాదించిన అకడమిక్ డిగ్రీలను కోల్పోయేలా చేస్తుంది, ప్రాసిక్యూషన్ను ఎదుర్కోవలసి వస్తుంది అని నివేదిక పేర్కొంది.
రోహిత్ వేముల అనేక సమస్యలతో బాధపడేవాడనే, అవే అతని జీవితాన్ని అంతం చేయడానికి దారితీసిందని నివేదిక పేర్కొంది.
నిందితుల చర్యలే రోహిత్ వేముల ఆత్మహత్యకు పురికొల్పినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
పోలీసుల వాదనలు తప్పని వేముల సోదరుడు రాజా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశ్రయిస్తామని చెప్పారు.
ఈ పరిణామంపై వేముల రోహిత్ సోదరుడు రాజా స్పందిస్తూ.. పోలీసుల వాదన అసంబద్దమైనదని వ్యాఖ్యానించారు. తన భావాలను ఎలా వ్యక్తీకరించాలో అర్థం కావడంలేదన్నారు. ఒక పోలీసు అధికారి ఒక వ్యక్తి కులాన్ని నిర్ణయించలేడన్నారు. మే 4న (శనివారం) సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని తమ కుటుంబం భావిస్తోందని రాజా తెలిపారు. కుల ధృవీకరణ అంశంపై 2017లో పోలీసులు విచారణను నిలిపివేశారని, 15 మంది సాక్షులు తమ వాంగ్మూలాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదని రాజా విమర్శించారు.
కాగా దర్యాప్తుపై రోహిత్ వేముల బంధువులు లేవనెత్తిన సందేహాల నేపథ్యంలో, ఈ కేసుపై తదుపరి విచారణ జరుపుతామని తెలంగాణ పోలీసులు తెలిపారు.