హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో భరోసా కేంద్రాన్ని స్థాపించాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం చేసిన అభ్యర్ధనకు స్పందనగా, అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో రూ.2.45 కోట్లతో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని డిజిపి అంజనీ కుమార్ ప్రారంభించారు.
ఈ భరోసా సెంటర్ ఏర్పాటుతో ఇక్కడి నివాసితులకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు మరింత సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే క్రమంలో పోలీసు శాఖ నిబద్ధతను సూచిస్తుందని డీజీపీ తెలిపారు. భరోసా సెంటర్ అవసరమైన వారికి తక్షణ సహాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని డిజిపి చెప్పారు.
సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లోని పిల్లల-స్నేహపూర్వక కార్నర్ కఠిన పరిస్థితులలో మద్దతు అవసరమయ్యే పిల్లలకు ఓదార్పు వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో ప్రారంభించారు. ” పౌరుల సంక్షేమం, హక్కులను పరిరక్షించడంలో మా నిబద్ధతకు కార్నర్ నిదర్శనం” అని డీజీపీ అన్నారు. భరోసా సెంటర్ అనేది నేర బాధితులకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు సమగ్ర మద్దతు, సహాయాన్ని అందించడానికి రూపొందించిన ఒక ప్రత్యేక సౌకర్యం. క్లిష్ట సమయాల్లో వ్యక్తులు సహాయం, మార్గదర్శకత్వం,కౌన్సెలింగ్ కోసం ఇది సురక్షితమైన సాధనంగా పనిచేస్తుంది.
ఈ కార్యక్రమంలో ఎడిజి శిఖా గోయల్, జిల్లా ఎస్పి రమణ కుమార్, సంగారెడ్డి ఎఎస్పి అశోక్ కుమార్, సంగారెడ్డి డిఎస్పి రమేష్ కుమార్, జిల్లా పోలీస్ ఉన్నతాదికారులు తదితర పొలీసు సిబ్బంది పాల్గొన్నారు.