హైదరాబాద్: తెలంగాణ ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నెలకొన్న హీట్ వేవ్ కారణంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని మరో గంటపాటు పెంచింది. కొత్త సమయం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని ఈసీ ప్రకటించింది.
ప్రస్తుతం తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఉక్కపోతలతో, ఎండ తీవ్రతకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఆసక్తిగా ఓటు వేసే వారికి ఈ ఎండలు కాస్త ఇబ్బందికి గురిచేస్తుందని గుర్తించిన ఎన్నికల అధికారులు పోలింగ్ సమయాన్ని పెంచినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఓటింగ్ కోసం పొడిగించిన సమయం 12 లోక్సభ నియోజకవర్గాల్లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వర్తిస్తుంది. మిగిలిన ఐదు పార్లమెంట్ స్థానాల్లో, కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఈ సమయం వర్తిస్తుంది. అయితే నక్సల్స్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్కు అనుమతించారు.
కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ (ఎస్సీ), నల్గొండ, భోంగీర్ లోక్సభ స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపింది.
ఆదిలాబాద్ లోక్సభ స్థానంలోని ఐదు, పెద్దపల్లిలో మూడు, వరంగల్లో ఆరు, మహబూబాబాద్లో మూడు, ఖమ్మం లోక్సభ స్థానంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా కొత్త సమయం వర్తిస్తుందని ఎన్నికల సంఘం తన నోటిఫికేషన్లో పేర్కొంది.
ప్రస్తుతం తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ప్రభావం ఓటింగ్ శాతంపై పడుతుందనే భావనతో పలు రాజకీయ పార్టీ ఎన్నికల సమయాన్ని పెంచాలని ఈసీని అభ్యర్థించడంతో సమయాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.