న్యూఢిల్లీ : దేశం కోసం మా అమ్మ తన మంగళసూత్రాన్నే త్యాగం చేసిందని, యుద్ధ సమయంలో తన అమ్మమ్మ బంగారం దానం చేశారని ప్రధాని మోడీకి… ప్రియాంక గాంధీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ.. ”గత రెండు రోజులుగా మీ మంగళసూత్రం, బంగారం కాంగ్రెస్ వాళ్లు లాక్కోవాలనుకుంటున్నారని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయ్యింది, కాంగ్రెస్ ప్రభుత్వం 55 ఏళ్లుగా అధికారంలో ఉంది. అప్పుడు ఎవరైనా బంగారం లాక్కున్నారా? మీ మంగళ సూత్రాన్ని గుంజుకున్నారా? అని ఆమె ప్రశ్నించారు.
”మంగళసూత్రం’ ప్రాముఖ్యతను మోడీజీ అర్థం చేసుకుని ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడేవారు కాదు.. నోట్ల రద్దు జరిగినప్పుడు మహిళల పొదుపు సొమ్మును ఎత్తుకెళ్లారు.. రైతుల నిరసనలో 600 మంది రైతుల ప్రాణాలు బలిగొన్నారు. ఆ రైతుల ఇల్లాలి ‘మంగళసూత్రం’ గురించి ఆలోచించాడా? మణిపూర్లో ఒక మహిళను వివస్త్రగా ఊరేగించినప్పుడు, ఆమె ‘మంగళసూత్రం’ గురించి ఆయన ఆలోచించాడా? ఈ రోజు మహిళలను భయపెట్టడానికి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. వారు భయపడి ఓటు వేస్తారని భావిస్తున్నాడు” అని ప్రియాంక గాంధీ అన్నారు.
సామాజిక మాధ్యమం X లో ప్రియాంక గాంధీ మాటల వీడియో లింక్
https://x.com/INCIndia/status/1782798070411117009
రాజస్థాన్లోని బాన్స్వారాలో ప్రధానమంత్రి మోడీ చేసిన మాట్లాడుతూ… దేశంలో ముస్లింలు అధిక సంఖ్యలో పిల్లలను కలిగి ఉన్నారని, కాంగ్రెస్కు అధికారమిస్తే దేశ సంపదను ముస్లింలకు, చొరబాటుదారులకు పంచిపెడుతుందని, మంగళసూత్రాలు కూడా తెంచి వారికి ఇచ్చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల సంఘం మోడల్ ప్రవర్తనా నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించినందున దీనిపై విపరీతంగా విమర్శలొచ్చాయి.
రాజస్థాన్లోని జాలోర్లో ఈరోజు తెల్లవారుజామున, నరేంద్ర మోడీ కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించారు. మత ప్రాతిపదికన ముస్లింలకు దళితులు, వెనుకబడిన వర్గాలకు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వాలని పార్టీ భావిస్తోందని ఆరోపించారు.