అమరావతి: ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, ఇంటెలిజెన్స్ చీఫ్ పి.సీతారామాంజనేయులును కేంద్ర ఎన్నికల సంఘం నిన్న సాయంత్రం బదిలీ చేసింది.
ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను తక్షణమే విధుల నుంచి తప్పించాలని, పార్లమెంట్కు, రాష్ట్ర అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పనులు అప్పగించవద్దని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎలక్షన్ కమిషన్ కోరింది.
ఇద్దరు అధికారుల నిష్క్రమణ కారణంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి బుధవారం మధ్యాహ్నం 3 గంటలలోపు పేర్లు సూచించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిని కోరింది.
విజయవాడలో తన ఎన్నికల ర్యాలీలో జగన్పై దాడి జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ (టిడిపి) మాజీ రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు రాసిన లేఖ నేపథ్యంలో అధికారుల బదిలీ జరిగి ఉండొచ్చని అనుకుంటున్నారు.
సీనియర్ న్యాయవాది రవీంద్ర కుమార్, ఇద్దరు అధికారులను మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పోలీస్ ఫోర్స్ హెడ్ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా ఆ పోస్టునుంచి తప్పించాలని కోఆరు. కాగా పోలీసులు తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఈసీకి రాసిన లేఖలో ఆరోపించారు.
జగన్పై దాడిని ఖండిస్తూ…ఆయనకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసుల అసమర్థతపై లేఖలో ఈసీకి పిర్యాదు చేశారు.
ఈ పరిస్థితుల్లో మే 13న ఆంధ్రప్రదేశ్లో పోలీసులు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని రవీంద్ర కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
చిత్తూరులో చంద్రబాబు నాయుడుపై, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై రాళ్లదాడికి పాల్పడిన విషయాన్ని ఆయన ఈసీకి రాసిన లేఖలో ప్రస్తావించారు.
జగన్పై జరిగిన దాడికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపించాలని, స్థానిక పోలీసులు విధుల నిర్వహణలో నైపుణ్యాన్ని కోల్పోయారని, నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోయారని రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.