న్యూఢిల్లీ: దేశంలో కుల గణనను ఏ శక్తీ ఆపలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తమని తాము దేశ భక్తులుగా చెప్పుకునే వారు కులగణనకు సంబంధించిన విషయంలో మాత్రం భయపడుతున్నారని పరోక్షంగా ప్రధానమంత్రిని, ఆయన పార్టీ బీజేపీని విమర్శించారు.
నిన్న ఢిల్లీలో జరిగిన సోషల్ జస్టిస్ మీటింగ్లో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ… కుల గణనపై తాను రాజకీయం చేయడం లేదన్నారు. తన జీవితంలో అది టార్గెట్ అని తెలిపారు. దాన్ని తానేమీ వదలబోమన్నారు. కుల గణనను అడ్డుకునే శక్తి ఏదీలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే, తొలుత తాము కుల గణన చేపట్టనున్నట్లు రాహుల్ వెల్లడించారు. కుల గణన అంటే కేవలం కులాల సర్వే కాదు అని, దానికి ఆర్థిక, వ్యవస్థీకృత సర్వేను కూడా కలపనున్నట్లు ఆయన చెప్పారు.
బడా వ్యాపారులకు రుణమాఫీగా ఇచ్చిన రూ.16 లక్షల కోట్లలో కొంత భాగాన్ని 90 శాతం మంది భారతీయులకు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ మేనిఫెస్టో లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అన్యాయం జరిగిన 90 శాతం జనాభాకు న్యాయం జరిగేలా చూడడమే తన జీవిత ధ్యేయమని గాంధీ అన్నారు.