కాకినాడ: పరిశ్రమ వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు వేసిన పైపులైన్లను తొలగించాలని కోరుతూ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొనపాపపేటలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ఇది నిన్న తీవ్ర రూపం దాల్చింది. వందలాది మంది మత్స్యకారులు కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.
పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన పైపులైన్ల నుంచి ప్రమాదకర వ్యర్థాలు సముద్రంలోకి వదలడం వల్ల మత్స్య సంపదకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పైపులైన్లను వెంటనే తొలగించి మత్స్యకారుల జీవనానికి, వృత్తికి భద్రత కల్పించాలని ఆందోళనకారులు కోరుతున్నారు. ఈ విషయమై గత మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులు అక్కడే ఉన్న బోటును తగులబెట్టి నిరసన తెలిపారు.
వెంటనే పైపులైన్లు తొలగించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. కొందరు వ్యక్తులు పెట్రోల్ క్యాన్లతో హల్ చల్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రోడ్డు మొత్తం ఆందోళనకారులతో నిండిపోవడంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది.
అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించకుంటే వేలమందితో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించాల్సి ఉంది.