హైదరాబాద్: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో చోటుచేసుకుంది. ఈదురు గాలులకు రెండు గర్డర్లు కూలిపోయాయి. అర్ధరాత్రి దాటిన సమయంలో ప్రమాదం జరగడంతో పెనుప్రమాదం తప్పింది.
మంగళవారం జరిగిన ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. 2016 నుంచి కిలోమీటరు మేర వంతెన పనులు కొనసాగుతున్నాయి.జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి గ్రామాన్ని ఓడేడు గ్రామాన్ని కలిపేలా వంతెన నిర్మాణం జరుగుతోంది.
కాంట్రాక్టర్ మార్పు, నిధుల కొరత తదితర కారణాలతో పనులు ఆలస్యమయ్యాయి. వంతెన కింద ఉన్న తాత్కాలిక రహదారిని స్థానిక ప్రజలు రాకపోకలకు ఉపయోగిస్తున్నారు. 2016లో బ్రిడ్జికి శంకుస్థాపన చేయగా.. దీని అంచనా వ్యయం రూ.47.40 కోట్లు కాగా ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఈ వంతెన వల్ల మంథని-పరకాల మధ్య, భూపాలపల్లి, జమ్మికుంట పట్టణాల మధ్య దాదాపు 50 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అంచనా.
ఇదిలా ఉండగా, నిర్మాణ పనుల్లో ఉన్న వంతెన కుప్ప కూలిపోవడంపై తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన కాళేశ్వరం తోపాటు పలు బ్రడ్జీలు నాణ్యత లోపంతో నిర్మాణ పనులు చేపట్టారన్నారు. గుత్తేదారులు ఇచ్చే కమిషన్లకు బిఆర్ఎస్ నాయకులు కక్కుర్తి పడటంతో పనుల్లో నాణ్యత ప్రమాణాలను కాంట్రాక్టర్లు గాలికొదిలేశారన్నారు.
ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకపోయి ఓడేడ్ బ్రిడ్జిపై విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నిర్మాణం కొనసాగుతున్న ఓడేడ్ బ్రిడ్జి గడ్డర్లు గాలికి కూలడంతో పనుల్లో ఎంత నాణ్యత ఉందొ తెలుస్తోందన్నారు. బ్రిడ్జి కూలిన సమయంలో జనం లేకపోవడంతో ఊపిరి పీల్చున్నారని లేదంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని మంత్రి అన్నారు.