నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మొన్న రాత్రి 11 గంటల సమయంలో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. స్థానికుల వివరాల ప్రకారం… శ్రీపురం చౌరస్తాలో ఫుట్ పాత్ పై గత ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం డబ్బాలను ఏర్పాటు చేసింది.
ఈ అగ్ని ప్రమాదంలో పాదరక్షల దుకాణం, పండ్ల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రెండు గంటలపాటు మంటలు చెలరేగాయి. అయితే అగ్నిమాపక యంత్రం లేకపోవడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. చివరికి మున్సిపల్ ట్యాంకర్లతో మంటలను ఆర్పివేశారు.
అప్పటికే నష్టం వాటిల్లడంతో దుకాణదారులు కన్నీరుమున్నీరయ్యారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. బాధితులను ఆదుకుంటామన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి.
జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద అగ్నిప్రమాదం జరగడం ఇదే తొలిసారి. అయితే, అగ్నిప్రమాదాల సమయంలో, అగ్నిమాపక యంత్రం అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.